నమస్కారం, నవతరంగం పాఠకులకి అందిస్తున్న మరో శీర్షిక, “ఈ పాట మీరు విన్నారా?” కి స్వాగతం. “ఈ పాట విన్నారా?” అనే ఆలోచన నాది కాదు, ఆర్కుట్లోని “తెలుగు పాట” అనే కమ్యూనిటీలో ఒక వ్యక్తి మొదలుపెట్టిన “దారం” అదేనండీ “త్రెడ్”. అది చూసిన నాకు, మన నవతరంగంలో ఈ శీర్షిక నిర్వహిస్తే బాగుండనిపించింది. కనుక “ఇందులో నా గొప్పేమీ లేదు” అని నాకు నేనే కొట్టుకుంటున్న ఢంకాని వినగలరు, గమనించగలరు. మంచి సాహితీ విలువుండీ కొన్ని కారణాల వల్ల ప్రేక్షకులకి అంతగా పరిచయంలేని కొన్ని ఆణిముత్యాలని ఈ శీర్షిక ముఖతా మీ ముందుకు తీసుకురావలనే మా ఈ ప్రయత్నం.ఆపాత మధురాలు కావచ్చు, జానపదాలకు సారూప్యంగా ఉన్న బాణీలు కావచ్చు, ఆధునిక బాణీలలో కొట్టుకుపోయిన గీతాలు కావచ్చు, ఇలా శిల్పవస్తువేదైనా కావచ్చు, ఇక్కడ చర్చించుకుందాం, కొత్త సంగతులను తెలుసుకుందాం, ఆలోచనలు పంచుకుందాం.తప్పులుంటే సవరించగలరు. మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకంతో… మీ సతీష్ కుమార్ కొత్త.
![]()
“ప్రాణం ఖరీదు”, 1978లో విడుదలైనా ఈ చిత్రం దర్శకనిర్మాతలకి డబ్బు తెచ్చిపెట్టకపోయినా, మంచిపేరు తెచ్చిపెట్టాయి. నేటి మెగాస్టార్ చిరంజీవి గారికి, విడుదలైన చిత్రాల్లో ఇది మొట్టమొదటిది, తెలుగు సినీలోకానికి కోటా శ్రీనివాసరావు గారిని అందించిన సినిమా కూడా ఇదే. మనలో చాలామందికి జాలాది రాజారావు గారి పేరు ఒక్కసారిగా గుర్తురాకపోవచ్చు, ఆయనా చాలా మంచి పాటలు వ్రాసినా, ప్రేక్షకలోకానికి ఆయన పేరు అంతగా గుర్తులేదని నా అభిప్రాయం, ఏమిటీ? మీకూ తెలియదా? సరే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకి సాహిత్యం రాసినా,ఆయన రచనల్లో ప్రజాదరణ పొందిన కొంతపాతబడినా అందరికీ తెలుసనుకుంటున్న ఓ ఉదాహరణ, “మేజర్ చంద్రకాంత్” సినిమాలోని “పుణ్యభూమి నా దేశం” అనే పాట, గుర్తుపట్టారా? అవునండీ ఈ పాట రాసింది జాలాదివారే.
ఆయన కలం నుండి జాలువారిని ఈ “యాతమేసి తోడినా” అనే గీతం చూడండి, పదాలని జానపద ఫక్కీలో పొదిగి సామాన్యుడికి దగ్గరగా వ్రాశారు.మన తెలుగులో ప్రకృతినీ, సమాజాన్నీ పోలుస్తూ రాసిన కవుల్లో ఒకరు వేమనగారు, జాలాదిగారి ఈ రచనలో వేమన ప్రభావం కనిపిస్తుంది. ఈ పాటలో కవి మానవుడు చేసే తప్పులనీ, పక్షపాత దోరణినీ ఎత్తిచూపటానికి ప్రకృతిని(పశుపక్ష్యాదులను కలుపుకుని)మార్గదర్శకంగా ఎంచుకున్నారు. చిత్రంలో ఈ పాటలో కైకాల సత్యనారాయణగారు నటించారు.
పల్లవి:
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైన పూరి గుడిసేలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు
||యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు||
ఓసారి పల్లవి గమనించండి, “యాతం వేసి ఎంత తోడినా ఏరు ఎలా ఎండదో, మనలోని కల్లోలానికి ఎన్ని అశృధారలు పోసినా అది శాంతించదు,మనసులోని బాధలు ఏరు లాంటివి ఎన్నినీళ్ళు తోడి పారబోసినా అది ఎండదు, బాధా తీరదు. ఎంతటివారైనా ఈ కష్టాలకి అతీతులు కారు అనే ఉద్దేశ్యాన్ని మనం పల్లవి నుండి అర్ధం చేసుకోవచ్చు.”
చరణం 1:
పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ
కడుపు కోత కోసినా అది మణిసికే జన్మ ఇత్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
||యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు||
మొదటి చరణంలో మనిషి యొక్క పక్షపాత వైఖరిని తలదించుకునేలా చూపించారు, స్త్రీని పశువులా చూసే సమాజాన్ని అసహ్యించుకుంటూ, స్త్రీయొక్క త్యాగశీలతను పొగడకనే పొగిడారు. ఆ పోలిక చూడండి ఎంత భావుకంగా రాశారో, “ఆడదాన్నీ తాళిబొట్టు తాడు కట్టీ, పాడి ఆవుని పలుపుతాడేసి ఇంటికి తెస్తాము, ఆవుకి కుడితినీళ్ళు పోసినా పాలిస్తుంది, ఆడదానికి కడుపుకోస్తే బిడ్డకి జన్మనిస్తుంది, మరో మనిషికి జన్మనిస్తుంది, ఆడాదాన్ని పశువుగా చూసి తూలనాడే రోజున ఓ సారి నీ పుట్టుక తలుచుకో” అలాగే రెండో చరణంలో,
చరణం 2:
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దె లో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటదా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా
||యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు||
సమాజంలోని పేద ధనిక వర్గాలపట్ల ఉండే వ్యత్యాసాన్ని గూర్చి బాధని వ్యక్తపరిచారు. “గొప్పవారైనా, పేదవారైనా, ప్రయాణ సాధనాలు వేరుకావొచ్చు కానీ ప్రయాణ దూరమొక్కటె ఆ దారీ ఒక్కటె, అలానే రంగులోనూ, అలంకరణలోనూ తేడా ఉన్నా శరీరమొక్కటె, బ్రతికున్నప్పుడు ఎంత భోగంగా బ్రతికినా తుదకు చనిపోయాకా అందరినీ మోసేది పాడే, శాస్వత చిరునామా వల్లకాడే అనీ, డబ్బు ఉండి కాస్త మాట నేర్చిన గొప్పవారిని కోకిలలనీ, ఆకలేసి ఆర్తనాదాలు పెడుతున్న పేదలని కాకులనీ పరిగణించటం ఎంత వరకూ న్యాయం? కాకి, కోకిలా వేరు వేరు పక్షులైనా రంగు ఒక్కటే, పేదా ధనికా వర్గాలు బ్రతుకుతీరు వేరైనా మనుషులమే కదా”….ఈ రెండో చరణం వింటే నాకు అన్నమాచార్య వ్రాశిన “బ్రహ్మమొక్కటే…పరబ్రహ్మమొక్కటే” గుర్తొస్తుంది.
జాలాది గారి సాహిత్యానికి, చక్రవర్తిగారి బాణీ, బాలూగారి ఆర్ధ్ర గాత్రం చేరి ఈ శిల్పాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దాయి.మొదటిసారి ఈ సరళ భావావేశాన్ని విన్నప్పుడు మనసు ద్రవించి కళ్ళు చమర్చుతాయి..ఈ పాట మీరు విన్నారా? వినకుంటే తప్పక వినండి.
“యాతమేసి తోడినా ఏరు ఎండదూ, ఎన్నిసార్లు విన్నా తనివితీరదూ…”
ఈ పాటయొక్క వీడియోని యూట్యూబ్ లో పెట్టినందుకు “amritar83″ చానెల్ వారికి నా కృతజ్ఞతలు, నన్ను “ఈస్నిప్స్”లో పెట్టకుండా ఆపుతున్న సాంకేతికకారణాలకు నా అక్షితలు.
K మహేశ్ కుమార్ says:
ఈ మధ్యనే ఒక టివి కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం గారుకూడా ఈ పాట గురించి చెప్పి, జాలాదిగారికి నేషనల్ అవార్డు ఇవ్వాల్సినపాట అన్నారు. మీ పరిచయం బాగుంది.
సతీష్ కుమార్ కొత్త says:
అవునండీ మహేష్ కుమార్ గారు, ఈ టీవీ “ఝుమ్మంది నాదం”లో ఈ పాట గురించి రెండు వారాల క్రితం ప్రస్తావన జరిగింది. అది విని నా స్నేహితులలోనూ, బంధువులలోనూ, చాలా మంది ఈ పాట ఎప్పుడు వినలేదు అని అన్నారు అది విని నేను ఆశ్చర్యపోయాను. అందుకే ఈ పాటను మొదటి వస్తువుగా తీసుకోవటం జరిగింది. మీ అభినందనలకి కృతఙతలు.
శిద్దారెడ్డి వెంకట్ says:
సతీష్ welcome to నవతరంగం. మంచి పాటను పరిచయం చేశారు.
ఈ శీర్షిక ను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను
సతీష్ కుమార్ కొత్త says:
శిద్దారెడ్డి వెంకట్ గారు, మీ అభినందనలకి మంగిడీలు. తప్పకుండా మరిన్ని పాటలను పరిచయం చేయటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను
MURALI RAVIKANTI says:
ఈ శీర్షిక బాగుంది.ఈ శీర్షికలో పాఠకులను కూడా వారికి అందుబాటులో ఉన్న పాటలను పంపే అవకాశం ఇవ్వండి.
K మహేశ్ కుమార్ says:
@మురళి: మీరు ఏదైనా పాట గురించి రాయాలంటే, రాసి navatarangam [@] gmail [.] com కు పంపండి. తప్పకుండా ప్రచురింపబడతాయి.
పులి రాజా says:
బాబోయ్ ఈపాటలు రాయడమేమిటి దానికి అర్ధాలు రాయడమేమిటి. వీలయితే సంగీత దర్శకుల గురించి కూడా రాసి రాగాల ప్రస్తావన లేకపొతే ఆ పాట రాయడానికి ప్రేరెపించిన విషయాలు ఏమైనా వుంటే రాయండి. ఇక్కడ అందరూ తెలుగు వచ్చినవాళ్లే. లేకపొతే హింది పాటల్లో మంచి పాటలుంటే వాటికి అర్ధాలు రాయండి. అంతేగాని ఇదేంటి?తెలుగు పాటని తెలుగులోనే వివరించడం??లేకపొతే మీకు నచ్చిన పాటైతే పాట రాసి ఇది గొప్ప పాట అని చెప్పండి చాలు.
సతీష్ కుమార్ కొత్త says:
పులిరాజ గారు, క్షమించాలి మీ ఉద్దేశ్యం సరైనదే కానీ ఓ పాటని పరిచయం చేసి. ఇది ఒక పాట, ఇది ఈ సినిమాలోనిదీ అని తెలపటానికి నవతరంగానికే రానక్కర్లేదేమో? ఆ పని చెయ్యటానికి, రాగా, మ్యుజిక్ ఇండియా వంటి సాధనాలు అంతర్జాలంలో అనేకం. సాహితీ విలువను, వినేందుకు సమయం దొరకని నేస్తాలకి ఈ శీర్షిక ఓ సాధనమవ్వాలని మా ఆకాంక్ష. అన్నీ తెలుగు పాటలే కదా అని అన్ని పాటలు, అన్ని పద్యాలు అందరికి అర్ధం కాకపోవచ్చు. మాటలని మాటలుగా తీసుకునేట్టైతే వాటి చర్చాగోష్టి దండగ. కొన్ని గ్రాంధిక భాషా ప్రయోగాలుంటాయి, మరికొన్ని వివిధ యాసలలోని పదాలను వాడబడి ఉంటాయి వాటిని సరళీకరించి పొందుపరచటానికి ఇది ఓ చిరు ప్రయత్నం అంతే కాని ఇది చదివేవారికి భాష తెలియదు అనే ఉద్దేశ్యం మాత్రం కాదు. కొన్ని రమణీయానుభూతులని కవులు కొన్ని “మాటలను” సీదాసాదాగా కాకుండా కవీ హృదయంతో కొన్ని పదాలను ప్రాసకోసమో లేక విలువ కోసమో పొదగడం జరుగుతుంది. ఆ పదాలు అందరికీ అర్ధం కావలనీ లేదు. అంతా బానే ఉంది, మరి ఈ పాటలో అంత అర్ధంకాని సాహిత్యమేముందీ అని మీరడిగితే అది వేరే విషయం. సంగీతం సాహిత్యం అనే వర్గంలో మనం తెలుగు పాటల గురించి మాత్రమే చర్చించుకోవాలి అని లేదు అన్య భాషా చిత్రాల విశ్లేషణ పెట్టినట్టుగానే వివిధ భాషల సంగీత విలువలూ సాహిత్య విలువలనూ గురించి చర్చించుకోవచ్చును. త్వరలో అటువంటి చర్చలు కూడా జరగగలవు.
rajasekhar says:
@ Satish kumar Kottha
Oka manchi patani parichayam chesaru, welcome to navatarangam.
పులి రాజా says:
అయితే ఓకే
గీతాచార్య says:
Nice but trgic song. Beautiful lyrics
K.S.M.Phanindra says:
చాలా మంచి ఆలోచన! నాదీ అచ్చం ఇదే భావన – మరుగైపోయిన పాటల్ని కొంతైనా వెలికితియ్యాలని. నా “తెరచాటు చందమామ” (తెర అంటే సినిమా తెర. తెరమరుగైపోయిన చందమామ లాటి సినిమా పాటలు) బ్లాగులో ఇదే ప్రయత్నం చేశాను. అయితే మీ ప్రయత్నంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయ్ –
1. నేను సాహిత్యాన్ని ఎక్కువ విశ్లేషిస్తూ ఉండిపోతాను. మీరు కొంత వివరణ చెప్పి, పాఠకుడిలో ఉత్సుకత రేకెత్తించి, త్వరగా పాట వినేలా చేస్తున్నారు. ఇదే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే 90% మంది సాహిత్యాన్ని పాట ద్వారా వింటారు తప్ప రాసుకుని చదువుకోరు. పాటల పుస్తకం ఉన్నా కూడా పాడుకుంటారు తప్ప చదివేవారు అరుదు.
2. సాహిత్యం గురించే చెబితే పాఠకుడికి బోర్ కొడుతుంది. ఆ సినిమా గురించి trivia చెప్తూ సాగడం వల్ల పాఠకుడికి interest కలుగుతుంది.
మీకు అభినందనలు! నేను పాటలు గురించి రాసే వ్యాసాలు కూడా ఈ శీర్షిక పేరు కిందే వ్రాస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే!
సతీష్ కుమార్ కొత్త says:
ఫణీంద్రగారూ, మీ మెచ్చుకోలుకి నా మంగిడీలు. వ్రాయటంలో ఇంకా ఓనమాలు దిద్దుకుంటున్న నాకు మీలాంటి వారి మాటలు స్పూర్తినిస్తాయి అందుకు నా వందనం.మీరు కూడా నిరభ్యంతరంగా ఈ శీర్షిక పేరు వాడుకోవచ్చును.చెప్పాను కదా ఇది నా ‘మానసశీర్షికా కాదని.
నేస్తం says:
ఒక మంచి పాటతో ప్రారంభించారు ఈ శీర్షికని. సంతోషం. కానీ “ఈ పాట మీరు విన్నారా” అన్న శీర్షికే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇది అప్పట్లో చాలా పెద్ద హిట్ అయిన పాట. ఈ పాట వినని వాళ్ళు అతితక్కువ మంది ఉంటారు (అని నాకు అనిపిస్తోంది). అంతకంటే “ఒక మంచి పాట” అని పెడితే బాగుండొచ్చు అనేది నా అభిప్రాయం. పోన్లెండి మీ ఇష్టం.
.
రెండో చరణాన్ని మీరు విశ్లేషించిన దాంట్లో “అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే” అనే మాటకీ అర్ధం ‘గొప్పవారైనా, పేదవారైనా, ప్రయాణ సాధనాలు వేరుకావొచ్చు కానీ ప్రయాణ దూరమొక్కటె ఆ దారీ ఒక్కటె’ అన్నారు. కానీ నాకు తెలిసినంతవరకూ అది కాదు దాని అర్ధం. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు అందరు ఒకేలా వస్తారు, ధనికులని ఏమీ ఒక పూలు చుట్టిన బంగారపు ఉయ్యాలలో ఆకాశంనుంచి నేలకు దించరు కదా.. వాళ్లైనా తల్లి కడుపునుంచే పుడతారు. అలాగే “చీము నెత్తురులు పారే తూము ఒక్కటే” అన్న మాట ‘అందరిలోనూ ఉండేది ఒకటే రక్తం’ అనే మాటకి మరింత తేలికైన మాటల రూపాంతరం. ఈ పాట ఒక చదువురాని గ్రామీణుడు పాడుతుండటం వల్ల ఈ ప్రయోగం పాటకు మరింత శోభనిచ్చింది. అలాగే చనిపోయాక కూడా ఎవరైనా ఆ వల్లకాటికే చేరాలి. అక్కడ ధనికులకి, పేదలకి వేరు వేరు చోట్లుండవు. (మన అదృష్టంకొద్దీ ఇంకా డీలక్స్ శ్మశాన వాటికలు, స్పెషల్ దహనాలు లాంటి ఐడియాలు ఏ కార్పొరేట్ సంస్థలకీ రానందుకు సంతోషించాలి). ఈ రకంగా పుట్టుక, మనుగడ, చావు .. మూడింటిలోనూ అందరు సమానమే కానీ నడుమ వచ్చినవే ఈ అంతస్తుల తేడాలు అని కవి భావన అని నా ఉద్దేశం.
.
“కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా … ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా”.. కోకిల గుడ్లని కూడా కాకే పొదుగుతుందని అంటారు. చిన్నిపిల్లలుగా ఉన్నప్పుడు కాకి, కోకిల ఒకేలా ఉంటాయి. కూతనిబట్టే వాటిని వేరుగా గుర్తించగలం. అలాగే ధనికుడు కూడా పేదవాడి కష్టంతోనే పెరిగి ‘పెద్ద’ వాడు అయి మళ్ళీ ఆ పేదనే చులకనగా చూస్తాడు.
.
కృతజ్ఞతలు.
సతీష్ కుమార్ కొత్త says:
నేస్తంగారికి, (మీ తెరపేరు వ్రాస్తుంటే, “నేస్తాంగారికి” అని సంబోధించాలి అని స్పురించటంలేదు, “నేస్తానికి” అని అనాలని తప్ప).ముండే చెప్పినట్టు ఈ పేరు నా “మనోజనిత” కాదు. నాకు వినటానికీ చూడటానికీ ఆకర్షణగ అనిపించింది. మరో ఇద్దరు స్నేహితులు కూడా ఇదే భావన(మీ భావనలాంటిది) వ్యక్తపరిచారు. “ఓ మంచి పాట” అని అనటాన్ని గురించి మా పెద్దాయన (శ్రీ బాలసుబ్రమణ్యం గారు) ఏదో సంధర్భంలో (బహుశా ఓ పాటలపోటీలో శైలజగారు న్యాయనిర్ణేతగా వచ్చినప్పుడు ఆవిడ వాడిన మాట)అలా అంటూ ఏమీ ఉండవనీ, అన్నీ మంచి పాటలేననీ అర్ధం వచ్చేలా అన్నట్టు ఙాపకం, కానీ ఈ మధ్యే వచ్చిన “ఝుమ్మంది నాదం” అనే కార్యక్రమంలో ఆయన పాటలని రెండు వర్గాలుగా విభజించ వచ్చు అని చెప్పారు (మంచి పాటలు, చెడ్డపాటలు).కాబట్టి ఆ విషయంగా నేను మీమాంశకి లోనయ్యి, మిగతావారిని (సంగీత దర్శక,నిర్మాత,రచయిత/కవి,గాయకులని) వేరేగా చూపించటం అవుతుందేమో అని కాస్త ఆలోచించటం జరుగుతుంది.
మీరన్నట్టు/విశ్లేషించినట్టు, ఆ భావం సరైనదే, చూశారా చదివే తీరుకీ, అర్ధం చేసుకునే తీరుకీ తేడా ఉంటుందని, మన సహపాటకులైన పులిరాజా గారికి నేను చెప్పింది నిజమైంది. నాకు నా తప్పు ఎత్తి చూపినందుకు చాలా ఆనందంగా ఉంది.ఎందుకంటే నాలాంటి వారికెందరికో ఇలాంటివి స్ఫురించవుగనుక, ఈ శీర్షికన తెలుసుకోగలరుగనుక.
మీరన్నట్టు శ్మశాన సేవలలోనూ పెను మార్పులే వచ్చాయండోయ్, యే కులానికి ఆ కులానికి వేరు వేరు శ్మశానాలూ వెలిశాయి, అంత్యకృయలలోనూ వారి వారి తాహతూ, హోదాను బట్టి వేరే పద్దతులుంటాయని ఈ మధ్యే తెలిసింది నాకు.
సతీష్ కుమర్ కొత్త says:
పై ప్రచురణలో అక్షరదోషాలు దొర్లాయి మన్నించగలరు
K.S.M.Phanindra says:
విజయవాడలో ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లో వివిధభారతిలో వచ్చే ఈ పాట నాకు చాలా నచ్చేది. అయితే పల్లవి అర్థం కాలేదు. మా హాస్టల్ వార్డెన్ని అడిగితే ఇలా చెప్పారు – యాతం అంటే పల్లెల్లో నీళ్ళు తోడే సాధనం. పొంత అంటే నీళ్ళు తాగడానికి వాడే చిన్న కుండ. ఇక్కడ ఒక contrast చూపిస్తున్నాడు కవి – ఎంత తోడినా తరగని నీళ్ళున్న ఏరు లాటి వాళ్ళు (అనగా ధనికులు, గొప్పవాళ్ళు వగైరా), ఎంత ఏడ్చినా కనీసం తాగేందుకు నీరు లేని వారు. ఒకరు గుడిలో దీపం అయితే ఇంకొకరు పూరిగుడిసె లో దీపం. అయితే మరణానికి ఈ తేడా లేదు. గాలి ఇసిరి కొడితే దీపముండదూ అనడంలో – ఓ గుడిలో దీపమా మరీ విర్రవీగకు, నువ్వూ ఆరిపోక తప్పదు. అందరికంటే నువ్వు ప్రత్యేకం ఏమీ కాదు – అని చెప్పడం కనిపిస్తుంది. ఇది ధనాధికార మదంతో తూలుతున్న వారికి చెప్పిన హితబోధ. ఇలాటి భావమే రెండో చరణంలో కనిపిస్తుంది.
పల్లవికి మీరు చెప్పిన వ్యాఖ్యానం కూడా బాగుంది. అయితే మీ భావానికీ ఈ “దీపం ఆరిపోవడం” కీ అన్వయం ఎలా చెయ్యడం?
సతీష్ కుమర్ కొత్త says:
ఆవేశాన్ని సాత్వికంగా చెప్పారనుకున్న నాకు ఆయన వాడిన చురకత్తులను చూపించారు మంగిడీలు
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
పరిస్తితులన్నీ అనుకూలిస్తే(నేను బద్దకించకుండా ఉంటే అని మీరు చదువుకున్నా మీతప్పేమీలేదు)సాక్షాత్తూ జాలాది ముఖతఃమనమంతా ఈ పాటేమిటీ ఆయన రాసిన మరికొన్ని మంచిముత్యాలను కూడా వీడియో రూపములో చూడవచ్చు.కాకుంటే ఆయన ఆరోగ్యం అంతగా సహకరించటంలేదని వారి కుటుంబ సభ్యులొకరు చెప్పారు.
సతీష్ కుమర్ కొత్త says:
రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి,
మీ పరిస్తితులు అనుకూలించాలని కోరుకుంటున్నాము(బద్దకం తగ్గాలని కోరుకుంటున్నాను అని అనుకున్నా తప్పులేదు)వారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని భగవంతుడిని ప్రార్ధిద్దాం.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
మంగిడీలంటే ఏంటండి సతీష్ కుమార్ (అదే కదా మీ పేరు కుమర్ అని రాసారు అందుకడుగుతున్నా)
సతీష్ కుమార్ కొత్త says:
“మంగిడీలు” అనే పదప్రయోగం 1966 లో “శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న” అనే చిత్రంలో వాడటం జరిగింది.ఆ పదానికి అర్ధం “నమస్కారం/దండం”(దండం అనేది నాకెప్పుడూ నవ్వు తెప్పిస్తుంది, దండం అంటే నమస్కారం అనే అర్ధమూ వస్తుంది, కర్ర అనే అర్ధమూ వస్తుంది).ఈ చిత్రం ద్వారానే శ్రీ బాల సుబ్రమణ్యంగారు గాయకుడిగా తెలుగు సినీ పరిశ్రమకి శ్రీ కోదండపాణి గారి ఆధ్వర్యంలో అడుగుపెట్టారు.నవతరంగంలో నా పేరు ఇలా ప్రచురించబడిందని మీరనే వరకూ నేనుకూడా గమనించలేదు సుమీ…మళ్ళీ మీకు మంగిడీలు.
రామ says:
జాలాది గారి గొప్ప భావం ఒకటి గుర్తుకి వస్తుంది. “నేనింతే” లో భాస్కరభట్ల వ్రాసి, జనాలకి బాగానచ్చిన (?) “పుడుతూనే ఉయ్యాల, నువ్వుపోతే మొయ్యాల” అనే లైన్ వాస్తవానికి జాలాది గారు ఒక పాటలో (పాట, సినిమాపేరు గుర్తురావట్లేదు క్షమించాలి) ఎప్పుడో వ్రాసిన దానికి స్వేఛ్ఛోపయోగం.
Satish Kumar Kotha says:
క్షమించాలి ఇది అసంబద్దమూ,ఆకతాయితనమూ అని అనుకోనంటే, నాకు ఈ పాట (నేనింతే చిత్రంలోనిది) వింటే జంధ్యాల గారి హాస్యం గుర్తొస్తుంది (పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, చచ్చేటప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ సోకులెందుకే శశికళ)
నేస్తం says:
@రామ:
మీరు ప్రస్తావించిన పాట “ఎర్రమందారం” (రాజేంద్రప్రసాద్, యమున. సంగీతం:వందేమాతరం శ్రీనివాస్) సినిమాలోనిది.
యాలో యాలో ఉయ్యాల .. ఏడేడు జనమాలు మొయ్యాల
నాలుగు దిక్కుల ఉయ్యాల .. నలుగురు కలిసే మొయ్యాల..
కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల.. కళ్ళు మూసుకుంటే మొయ్యాల..
amrutha says:
నేస్తం గారు! మీరు చాలా షార్ప్ అండి
నేస్తం says:
అవునండి, ఎంత పదునంటే .. తెలీకుండానే చెవులు కోసుకుంటూ ఉంటాను మంచి పాటలంటే.
Thank you.
రామ says:
యు గాట్ ఇట్
amrutha says:
పాట ను వివరించిన విధానం చాలా బావుంది సతీష్ గారు ,మరిన్ని శీర్షికలు మీ ద్వారా రావాలని కోరుకొంటూన్నాం..ఇంతకి మీ బ్లాగ్ పేరు ఏంటి ?
అభినందనలు
సతీష్ కుమార్ కొత్త says:
అమృతగారు, మీ అభినందనలకి కృతఙతలు. బ్లాగులోనేముంది ఓ నాలుగయిదున్నాయి..:P
నేను ఎప్పుడొ ఓ సారి బ్లాగుతుంటాను. నే బ్లాగుతానని మీరనుకున్నందుకైనా ఈ కింద వాటిని చూడగలరు.
http://daanayya.blogspot.com
http://lovepages.blogspot.com
http://gaanakokila.blogspot.com
సుజాత says:
తెలుగు సినిమా పాటల్లో కొన్ని ఆణిముత్యాలని ఏరితే అందులో ఈ పాట తప్పకుండా ఉంటుంది.”మనుషులంతా ఒక్కటే”అని ఈ పాటకంటే ఇంకే రచనా చెప్పలేదేమో….అదీ ఇంత సింపుల్ గా!బాలు పాడిన తీరు కూడా అద్భుతం!
పాట కూర్చిన ట్యూనింగ్ కూడా ఒక అవ్యక్తమైన బాధని, మరో పక్క సంతోషాన్ని కలిగిస్తుంది. పులిరాజా అన్నట్లు ఇలా సులభ గ్రాహ్యమైన సాహిత్యం ఉన్న పాటలకు ఇంత వివరణ అనవసరం అనుకుంటాను. పాట కూర్చిన రాగం, పాట సాహిత్యానికి సంబంధించిన విషయాలు, ఇటువంటి ఆసక్తి కరమైన వివరాలు జతపరిస్తే బావుంటుంది, రాజా గారి “ఆపాత మధురాలు” లాగా!
సతీష్ గారూ, ఒక చిన్న సవరణ! “బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో,
గొడ్డు కాదు ఆడదనే “గుణం” తెలుసుకో అని రాశారు మీరు. కానీ అది “గుణం” కాదు, కులం! కులం అంటే గ్రామ్య భాషలో తేడా! గొడ్డుకీ, మనిషికీ తేడా గ్రహించి నడుచుకోమని భావం!
నేస్తం,
మీ వివరణ బావుంది.!
నేస్తం says:
సుజాతగారు, థాంక్ యు.
సతీష్ కుమార్ కొత్త says:
మీ వివరణకి ధన్యవాదాలు.మరో సారి ఇలాంటి అచ్చు తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడతాను. మరిన్ని పాటలు చర్చించుకోవటానికి సిద్దమవుతాను
సతీష్ కుమార్ కొత్త says:
“రాయలేను రాగమేదో ఙానంలేని వాడను” (“పాడలేను పల్లవైన భాషరానిదానను”, సాకి)…కనుకే ఇలా వాగేప్రయత్నం చేస్తున్నాను. తెలియని వాడిని కనుక ఊరుకోవటమో లేక పూర్తిగా తెలుసుకోవటమో చేసి కానీ ఆ దిశలోకి తిరగను లేదంటే నా మిడిమిడి ఙానానికి శంకరాభరణం శంకర శాస్త్రి గారొచ్చి “సతీష్ నువ్వు చెప్తున్న పాటేమిటీ వివరించిన రాగమేమిటీ?”, “రిషభమా వృషభమా” అని తీవ్రన్స్థాయిలో నా మీద పడగలరు.
రాకేశ్వర రావు says:
చాలా మంచి పాటను పరిచయం చేసారు. నవతరంగానికి స్వాగతం. మీ మొదటి టపా చూస్తుంటే మీరు నవతరంగానికి సువాసనలు పూసేవారిలా కనబడుతున్నారు – అంటే ఆర్టు సినిమా మాసు సినిమా అనే చీలికకు అతీతంగా అందరినీ ఆకట్టుకునేలా వుందీ టాపాంశము. మా ఆశలను వమ్ము చేయకండి
పైనెవరో అన్నట్టు అర్థాన్ని ఏదో ముద్దుస్వామి దీక్షితులు కృతిలా వివరింపనక్కరలేదేమో. అంటే కవిత్వం అన్నాక ఏ పాఠకునికాపాటకుడు తనదైన నిర్వచనం ఇచ్చుకుంటాడుగా. మీరిచ్చేదాని కంటే మంచి నిర్వచయం ఎవరికైనా తట్టబోతే దానిని మీరు నిరోధించినట్టుంటుందని నా భయం అంతే. మీకు కాస్త శ్రమ కూడా తగ్గుతుంది.
రాకేశ్వర
సతీష్ కుమార్ కొత్త says:
@ రాకేశ్వరరావుగారు,
తప్పకుండా క్లాసు,మాసు అనే తేడా లేకుండా కొనసాగించాలనే నా ప్రయత్నము కూడా. ఏదేని కారణాలు/బద్దకము తెర పైకి రానంత వరకూ ఆ ప్రయత్నాన్ని కొన్సాగించగలను అనే అనుకుంటున్నాను.కవి మాటల్ని ఆకళింపు చేసుకునే మనసున్నంత వరకూ రెవ్యూ చేసేవారికీ, నాకూ పని సులువుగా ఉండేట్టే చూసుకుంటాను. కాకపోతే ఇక నే చెప్పేదేమీ ఉండదేమొ అని నా భయం, సరైన చరిత్ర(హిస్టరి/బ్యాక్ గ్రౌండ్)లేదు గనుక, హోంవర్కు చేయకుండా సంగీతం గురించి మాట్లాడలేను (రాగాలు, మొదలగునవి) కనుక సాహితీ తృష్ణ వైపే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తాను, నా జిఙాశని కొనసాగిస్తాను.
సుజాత says:
రాకేశ్వర,
“ముద్దు స్వామి” దీక్షితులెవరు స్వామీ?
సతీష్ కుమార్ కొత్త says:
ఆ సదరు ముద్దుస్వామి దీక్షితులు గారు “ముత్తుస్వామి దీక్షితార్” కి పారడీ అయ్యుంటారు
సుజాత says:
సతీష్ కుమార్,
ఆ సదరు ముద్దుస్వామి దీక్షితులు గారు “ముత్తుస్వామి దీక్షితార్” కి పారడీ అయ్యుంటారు!
NaChaKi says:
చక్కగా వ్రాసావు. మంచి పాటతోనూ మొదలుపెట్టావు. శుభమస్తు! ముందు ముందు మరెన్నో గీతాలు ఇక్కడ కొత్తగా వినిపించాలని నా కోరిక. ఇంత వివరణ అక్కరలేదా అంటే… మనకున్న పాఠకవర్గాల రసజ్ఞతని బట్టి ముందు ముందు ఇంతటి విపులీకరణ అవసరం లేదేమో… కానీ, నా మటుకే అయితే ఎంత పొడుగు వ్యాఖ్యానమైనా “తట్టుకోగలను”.
“అశ్రు” అన్న ప్రయోగం సరి అయినది… “అశృ” అనరాదు. “శాశ్వత”, “వ్రాసిన”, “ఆర్ద్ర”, “చెమర్చు” వంటి ప్రయోగాల్లో కూడా అచ్చుతప్పులు దొర్లాయని గమనించగలవు. (అలాగే జ్ఞ బదులుగా ఙ వాడావు నీ ప్రతిస్పందనలలో. “జిజ్ఞాస”, “మీమాంస” అన్న పదాలు కూడా తప్పుగా దొర్లినవి.) Welcome to the RTS-powered world!
Srinivas says:
I heard one song in TV9 monsoon welcome program. Song is like “Dum dum dum dundhubi naadham dankaha naadham ” I am not sure about the lyric is correct or not. Anybody knows this song is from which movie.
Ram Cheruvu says:
That song is from a malayalam dubbing movie(1988) “Vishali” dircted by awarding winning director Bhrathan.
If I remember correctly, music is by “Ravi”.
essemCHELLURU says:
జాలాది గారి భావజాలం,పదప్రయోగం చాలా సరళంగా బాగుంటాయి అత్తనితో
కలిసి సభా వేదికల్లో అతని ప్రక్కని
కూర్చోవటం నా పూర్వ
జన్మ సుకృతంగా భావిస్తున్నాను