“వీర రక్తమును ఉడుకెత్తించే
విద్యానగర ప్రదాతకూ జై
ధరణిని కావగ దనుజులనణచిన
వరాహమూర్తికీ జై …”
పప పపాం పప పపాం …. అంటూ బాకావాయిద్య నేపధ్య సంగీతంలో బుఱ్ఱకధతో మొదలవుతుంది “పౌరాణిక బ్రహ్మ” కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోని “మహామంత్రి తిమ్మరుసు”.
కధ పూర్వాక్రమం తెలియని వారికి సినిమా పరిధికి లోబడి అవసరమైన మేర, తెలిసినవారి మెదడు పొరల్లో మగ్గుత్తున్న చరిత్ర పుటల చెదలు దులిపేంత మేర, విజయనగర రాజ్య తత్ కాలమాన పరిస్థితులని బుఱ్ఱకధారూపంలో చెప్పడం, ఒక అద్భుతమైన ప్రక్రియ. అలాగే మధ్యలో కనిపించే ఎఱుక కూడ. రాయలు వారు తెలుగు కి పెద్దపీట వేస్తే, దర్శక-కథారచయితలు తెలుగుతోపాటూ తెలుగుసంస్కృతికి కూడా ఆపీట వేసారు అనిపిస్తుంది.
కథ క్లుప్తంగా చెప్పాలంటే: రాయల వారిచే ఆప్యాయంగా అప్పాజీ అని పిలువబడే అమాత్యవర్యుడు తిమ్మరుసు, రాయల కొమరుడ్ని హత్యచేసాడని నిందకు గురౌతాడు. పర్యవసానంగా అప్పాజి కనుగ్రుడ్లు పెఱికివేయించమని ప్రభువు ఆజ్ఞ. పిమ్మట పశ్చాత్తాప్త హృదయుడైన రాయలు, పితృసమానుడిగా భావించే అప్పాజీ అచంచలమైన ప్రేమలో తిరిగి బందీ అవడంతో కధ ముగుస్తుంది.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని పలికిన తెలుగు వల్లభుడు కృష్ణదేవరాయలి చరిత్రను ఎరుగని తెలుగు వారు, ఈ కాలం సంగతేమోగానీ, ఆకాలంలో ఉండేవారుకారేమో. తెలిసన ఈ కధను మూడుగంటల పాటు ఆశక్తికరంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, కధ పరంగా తిమ్మరుసు(గుమ్మడి)కి, కధనం పరంగా రాయలు (ఎన్టీఆర్)కి సమ ప్రాథాన్యం ఇస్తూ సాగే జోడు గుఱ్ఱాల సవారీ మరొక ఎత్తు. ఇందులో దర్శకులు, సాంకేతిక వర్గం విజయంసాధించేరు అనడానికి, సినిమా విడుదలై సుమారు అర్ధశతాబ్ధికి పైగా కావస్తున్నా, ఈ దృశ్యకావ్యం గురించి ఈనాడు మనం పునఃశ్చరణ చేసుకుంటున్నామన్న విషయానికి మించి తార్కాణం ఏమికావాలి?
ఈ చిత్రంలో ముఖ్యంగా గుమ్మడి నటన గురించి చెప్పుకోవాలి. ప్రథమార్ధంలో రాయల్ని ఆజ్ఞాపించగలనన్న ధీమా, ద్వితీయార్ధంలో, వార్ధ్యక్యపు వాకిట తడబడుతూ బరువు బాధ్యలతోపాటూ, గారాబంగా పెంచిన రాయలకూ దూరమౌతున్నానా అని తనని తానే సంశయించుకునే తీరులో కనబరచిన వైవిధ్యం, మాటలకందనిది. రాయల మీద ప్రేమని, ప్రేమలోంచి ఉద్భవించే అభద్రతని, అభద్రతని అధిగమించే క్రమంలో రాజశ్రేయస్సుకోసం రాజునే అతిక్రమించడం, అతిక్రమణలో కూడ రాజు పట్ల విధేయత ప్రదర్సించడం, ఇన్ని సంక్లిష్ఠభావాల్ని పలికించడం ఆయనవల్లే సాధ్యమేమో! ఈ విధంగా పాత్రాని తలచిన రచయితకి, మలచిన దర్శకునికి, ఒలచిన (make-up) కళా-సాంకేతికవర్గానికి నా జోహార్లు.
నిజ జీవితంలో రాయలు కురూపి కావచ్చేమోకానీ, రాజకంఠీరవా అంటే ఎన్టీఆరే అనేంత రాజసం ఉట్టిపడే విగ్రహం అయనది. నటమయూరి ఎల్. విజయలక్ష్మి(చిన్నాజీ పాత్రధారిణి) తో వారి యుగళగీతం, “ప్రియవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా…”, జుగల్ బందీ తరహాలో పోట పోటీ గా ఉంటుంది. పాట చివరలో వచ్చే “నాగస్వర విన్యాసం”లో ప్రేక్షకుల హృదయాలు, విజయలక్ష్మి వయ్యారంతోపాటూ ఊయలలూగాల్సిందే. నాదృష్ఠిలో ఇది “మంచిమనసుకు మంచి రోజిలు” లోని “రావే నా చెలియా” తో సరితూగవలసినది. “పెండ్యాల” స్వర సారధ్యంలో “ఘంటసాల” గానమాధుర్యానికి ఇది తొలి పలుకు మాత్రమే ఈ సినిమాలో!
“మోహనరాగమహా-మూర్తిమంతమాయే …” అన్న పదవిరుపులతో, పెండ్యాల స్వరమెరుపులతో
“చిత్రసీమలో వెలయగజేసి” అంటూ ఎన్టీఆర్/దేవిక మన మనోచిత్రసీమలలో నిలయగ,
దివ్యగానమున జీవముబోసి ….” అంటూ ఘంటసాల/సుశీల గంధర్వగానంతో మనల్ని
స్వర్గసీమలలోపునరుజ్జీవులని చేస్తారు!
ఎస్.వరలక్ష్మి(తిరుమల దేవి పాత్రధారిణి) స్వయంగా పాడిన
“లీలా కృష్ణ, నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా” పాటలో,
లలితమైన పదాలతో పాటల “మయాబజార్” సృష్టించడం పింగళికే సాధ్యమౌనా అని అనిపించకమానదు. మరి మాటల విషయనికి వస్తే:
“నీకు ఏలుకోవడనికి ఒక చిన్నసామ్రాజ్యమే కావాలా” అని రసజ్నుడైన సార్వభౌముడు తన ప్రేయసి అయిన చిన్నాజీతో అనడంలో, రాయలి ఔదార్యాం గోచరిస్తుంది. అంతేకాదు, రాజ్యవిస్తరణాకాంక్షని నెరవేర్చగల శక్తులతోపాటూ, రససామ్రాజ్యాల్ని జయించగల యుక్తులూ రాయలు సొంతం అని అనిపించకమానదు.
అంతలోనే, అప్పాజీ అభీష్ఠం మేరకు తిరుమలదేవిని కేవలం రాజ్యక్షేమంకోసం వివాహమాడవలిసి వస్తూ, “ఒకసారి రాచరికిపు తంత్రంలో చిక్కుకున్నాతరువాత, స్వాతంత్ర్యసౌరభాలు సేవించాలంటే కత్తిమీద సామే” అంటాడు. ఇది రాచరికంలోని అనిశ్చితిని, ప్రజాసంక్షేమం కొరే ప్రభువులు గురయ్యే నిరంతర మానసిక సంఘర్షణనీ తెలియజేస్తూ, జరుగబోయే కీడుకు సాక్షులుకండని ప్రేక్షకులని హెచ్చరిస్తుంది.
ఇది మాటలు/పాటలు సమకూర్చడంలో పింగళి, కధనం/దర్శకత్వంలో కమలాకరుని ప్రతిభాపాటవాలకి ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే, పాత్రల ఆహార్యం విషయంలోనూ తీసుకున్న శ్రద్ధ, చూపించిన వైవిధ్యం అభినందనీయమైననవి.
కానీ, కథ ప్రారంభంలో, రాయలు( అదే ఎన్టీఆర్), “వృషభవీర” అనబడే ఒక వస్తాదుతో తలపడబోతూ, నీ ఉచ్చారణ బావులేదని వేళాకోళం చేస్తాడు. కాని అదే ఎన్టీఆర్ (అదె రాయలు) ఒక సంధర్భంలో “మేము గ్నానులము” అంటాడు. మనందరికి తెలిసిన విషయమేగా, ఎన్టీఆర్ కి “జ్ఞ” పలకదని.
అలాగే, మగవేషంలో ఉన్న అన్నపూర్ణాదేవి (అదె దేవిక) అన్న(ప్రభాకర్ రెడ్డి)ని ఎదిరించే పక్షంలొ, ఎన్టీఆర్, దేవికని, పసివాడా అని, బాలవీరా అని సంభోదించడమ్ జరుగుతుంది. ఇది కొంచం నవ్వు తెప్పిస్తెందుకంటే, నిండు కుండలా గుంభనంగా మగ వేషంలో ఉన్న దేవికని “పసివాడా” అన్నందుకు. అయితే, ఆ ముఖంలోని సాత్వికత, ప్రసన్న వదనం, ఆ ఆలోచనని పటాపంచలు చేస్తాయనుకోండీ. లేదా రాయల పరాక్రమం ముందు, అందరూ పసివారే అనైనా అనుకోవాలి!
ఇక కథలోకి వస్తే…
అప్పాజీ విజయనగరసామ్రాజ్యాన్ని విస్తరింపజేయడనికి తన యుక్తులన్ని ప్రయోగిస్తూ, శక్తులన్నీ ధారపోస్తుంటాడు. అందులో భాగంగానే, ఆగర్భ శతృవులైన గజపతులతో వియ్యానికి రాయలని ఒప్పించి, అన్నపూర్ణదేవి(దేవిక)ని రాయలకి కట్టబెట్టిస్తాడు. ఇది రాయలని దాసీపుతృడని కించపరిచే గజపతులకి చెంపపెట్టులాంటిది. అందుచేత అన్నపూర్ణదేవిని, ప్రేమించిన పతిని తొలిరాత్రే కడతెర్చమని తండ్రి(ముక్కామల) అర్ధిస్తాడు, తుదకు శాశిస్తాడు. అటు తండ్రి మాటకు, పరువు-ప్రతిష్ఠలకు, ఆత్మాభిమానానికి అడ్డుచెప్పలేనిదై, ఇటు ప్రేమించిన పతిని కడతేర్చజాలనిదైన స్త్రీ పడే మనోవ్యధను వ్యక్తపర్చడంలొ దేవిక సఫలీకృతురాలయ్యింది.
అప్పాజీ అన్నపూర్ణాదేవిని రక్షించడం, ఆమె (వరుసకు) పినతండ్రి అయిన హయగ్రీవుడు(లింగమూర్తి) ప్రతీకారేచ్చకోసం రాయల ఇంటచేరి, అపనమ్మకపు బీజాలు నాటడం, అవి మహావృక్షాలయై ఆ కూకటివ్రేళ్ళు అప్పాజి మెడకు చుట్టుకోవడం – ఇవన్ని చాలా ఆర్ధ్రంగా, భారంగా, కదులుతూంటే, సగటు ప్రేక్షడు సప్తశోకసముద్రాలలో ములిగి, తిరిగి ములిగినంత అనుభూతికిలోనవుతాడు. ఇప్పటి పరిభాషలో చెప్పలి అంటె – గుండెలు పిండేసేంత. ఆదిశేషువువలే కాపాడిన అప్పాజి, కాలసర్పమువలె కాటు వేసెనా అని రాయలు పడేవేదనని ఎన్టీఆర్ అద్భుతంగా పోషించారు. ఈ నేపధ్యంలో వచ్చే
” చరిత్ర ఎరుగని మహాపాతకం
మా దేశానికి పట్టినదా…”
అనే విషాదగీతం సంధర్భోచితంగా తోస్తుంది. యాధృచికం కాని విషయం ఎమిటంటే, ఈ సినీమా చరిత్ర గురించి చరిత్ర సృష్ఠించినా, చరిత్రలో చిరిగి చెరిగి, తెరమరుగవ్వాల్సిన ఈ ఒక్క వాక్యం మాత్రం నేటికీ సజీవమే!
“విజయనగర పౌరులెల్ల వీర రాయలే” అన్న ప్రజల మధ్య,
“ప్రజలే నాకళ్ళూ” అంటూ, అంధుడైన అప్పాజి రాయలని కౌగలించుకోవడంతో ఈ సినిమా ముగుస్తుంది!
ప్రజాసంక్షేమంకోరే ప్రభువుల,
ప్రభువుల కటాక్షం కాంక్షించే ప్రజల,
“మా సినిమాలో సగటు ప్రేక్షకుడు ఏవి కోరుకుంటాడొ అవన్నీవున్నయ్” అనే దర్శక-నిర్మాతల,
ఆత్మాధ్యయనానికి తెరలేస్తుంది!
–అసంఖ్య ధవళ
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
కడుపు నిండింది,ఈ వ్యాసం చదివాక
గమ్మత్తు చెప్పమంటారా కూడలిలో ఇదేచదివి,శ్రీకృష్ణపాండవీయం సినిమా చూసాము,3గంటల7నిమిషాల5క్షణాలు,అదైన వెంటనే ఇక్కడ ప్రత్యక్షం.
చిత్రసీమలో వెలయగజేసి..దివ్యగానముల జీవము పోసి..సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియే ఓ అనగా…వావ్
పెళ్ళయిన కొత్తల్లో ఎప్పుడన్నా మాఆవిడ అలిగినప్పుడు ఐస్ చెయ్యటానికి తరచూ ఈ పాట పాడేవాడినిలెండి :
ఉన్నతపాఠశాలలో మాకో,మాపై,కిందితరగతి వారికో నాన్-డీటైల్ద్ గా అప్పాజీ ఉండేది.అది చదివాను.ఈ సినిమా దాదాపు ఆకధానుసారం తీసారేమో నాకు తెలియదు.
తిమ్మరుసుగా గుమ్మడి అద్భుతం,కానీ చిత్తూరు నాగయ్య,యస్.వి.ఆర్ అయ్యుంటే?
సినిమా సాంకేతికాలకు సంబంధించి ఈ వ్యాసానికి కొనసాగింపు(లు)రాయాలి మీరు,తప్పదు:)
శిద్దారెడ్డి వెంకట్ says:
ధవళ గారూ,
నవతరంగానికి స్వాగతం. మీ నుంచి ఇలాంటి మరిన్ని వ్యాసాలు వస్తాయని ఆశిస్తున్నాను.
అసంఖ్య says:
ముందుగా నవతరంగం సంపాదకవర్గానికి నా మొదటి రచనని స్వీకరించినందుకు ధన్యవాదాలు. నేను ఎప్పటినుంచో నవతరంలో, నవతరంగంకోసం ఒక వ్యాసం రాద్దామని అనుకుంటున్నను. ఆమధ్యన “నవతరంగం” వెంకట్ గారి విద్యుల్లేఖ చదివి, ఆపనేదో ఈ సంవత్సరాంతంలోనె చెయ్యాలి అనుకున్నాను. కానీ రాసే ముందు ఇది సమీక్షా, విశ్లేషనా, వంటి విషయలు నా బుఱ్ఱలోకి అస్సలు రాలేదు. వచ్చినదల్లా, ఆ సినిమాలోని విశేషాలని, ఆ గండరగండల గొప్పదనాన్ని, నవతరంగం పాఠకులకి ఎలా వండి వార్చాలి అని మాత్రమే. ఈ ప్రయత్నంలో కొన్ని సూచన్లు చేసిన కొత్తపాళీ గరికి, సాలభంజికలు నాగరాజు గారికి నా కృతఙ్ఞతలు. అలాగే ప్రోత్సాహం అందించిన ఇస్మాయిల్ గారు, శ్రీనివాస్ పప్పు, కత్తి మహేష్ కుమార్, రాధిక గార్లకి కూడా.
@రాజేంద్రకుమార్ గారు:. మీ కడుపు నిండినందుకు సంతోషం. పాతసినీమాలన్నీ అక్షయ పాత్రల్లాంటివి. తినేవారి జీర్ణశక్తి, వడ్డించే వారి ఓపిక మాత్రమే పరిమితమయినవని మీకు తెలుసుగా
మీరన్నట్టు, సాంకేతిక దృక్కోణంలోంచి రాయాలని నాకు ఉంది. కాని నేనెప్పూడు వాటికి సంబంధించిన పుస్తకాలు అవీ చదవలేదు, కాబట్టి నాకు ఆ భాష (pan, zoom, mid-point, లాంటివి) పెద్దగా తెలీదు. కాని, 16 నిముషాల నిడివి గల అమెచురె సినిమాలాంటి వీడియోలు వగైరా తీసిన అనిభవం ఉంది. అందులో సినిమా పక్రియ గురించి నేను నేర్చుకున్న విషయాలను మాత్రం పంచుకోగలను, పాఠకులకు ఆసక్తి వుంటే ( నీసోది మాకెందుకు అని మొహంమీద చెప్పలేకపోయినా, మనసులో అనుకునే అవకాసమైనా మీకివ్వకూడదని)!
గమనిక: ఇంకా అక్కడక్కడ అప్పుతచ్చులు పంటికింద రాయిల్లా దొర్లుతునాయి. పాఠకులు సహృదయంతో మన్నించగలరు
Rohiniprasad says:
అభిమానులు మన్నిస్తే ఒక్క మాట. కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వం నాకెప్పుడూ గొప్పగా అనిపించలేదు. కె.వి.గారి దగ్గర ఆయనేం నేర్చుకున్నాడో నాకు తెలియదు. తిమ్మరుసును పరిచయం చేసే తొలి షాట్లో ఆయనను ఒక గ్రూప్ ఫోటోలో చూపడం అర్థం లేదని మా నాన్న కుటుంబరావుగారనేవారు. గొప్ప రాజకీయ చతురుడుగా, దర్బారులో తిరుగులేనివాడుగా ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి అది కాదని ఆయన అభిప్రాయం. చంద్రహారం, పాండవ వనవాసం, కాళిదాసు ఇవేవీ ఎన్ని సార్లు చూసినా నన్ను ఇంప్రెస్ చెయ్యలేదు.
In general, subtlety ఏ మాత్రమూ లేని ఎన్.టి.రామారావు తదితరుల మొరటు పౌరాణిక నటన grossగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే రంగారావు ఒక్కడే గొప్ప నటుడనిపిస్తుంది.
అసంఖ్య says:
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: మీరన్నట్టు SVR తిమ్మరుసు అయితే? రోహిణీ ప్రసద్ గారు “ఈమాట” లో చెప్పినట్టు గుర్తు “శివాజీ గణేశన్ లాంటి నటులే SVR వాళ్ళాని మింగేస్తాడని భయపడేవాళ్ళుట” అని. కాబట్టి తిమ్మరుసు పాత్రలో జీవిస్తారని చెప్పడానికి ఎటువంటి సంశయము లేదు. కానీ casting పరంగా చూస్తే, కొంచం సాత్వికంగా/అర్భకంగా (relative to SVR) ఉండే విగ్రహం అయితే మంత్రి/కులగురువు లాంటి పాత్రలకి బావుంటుంది అని నా అభిప్రాయం. ఉదాహరణకి, జయభేరి ని తీసుకోండి. నాగయ్య గారి పాత్రని SVR చేస్తే ఎలాఉంటుంది?
@రోహిణీ ప్రసాద్ గారూ: మీరు చాల ప్రశ్నలు లేవదీసారు. వాటన్నింటిని చర్చించడం కొంచం కష్టమే.
1) “తిమ్మరుసును పరిచయం చేసే తొలి షాట్లో ఆయనను ఒక గ్రూప్ ఫోటోలో చూపడం అర్థం లేదని మా నాన్న కుటుంబరావుగారనేవారు. గొప్ప రాజకీయ చతురుడుగా, దర్బారులో తిరుగులేనివాడుగా ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి అది కాదని ఆయన అభిప్రాయం”.
నిజమే కావచ్చు. కానీ, అప్పాజీ పాత్ర ప్రాముఖ్యత వగైరాలు పాట రూపంలో అప్పటికే పరిచయం చెయ్యబడ్డాయి. గుమ్మడి ని మొదటిసారిగే ప్రేక్షకులు చూసేది, రాయల యోగక్షేమాలని ఒక కంట కనిపెట్టేవాడుగానే! సినిమా కధపరంగా ఇది రాయలు vs అప్పజీ. ఈ రకంగా చూస్తే, దీన్ని భిన్నమైన introduction గా చూడొచ్చు ఇందులో తప్పు ఎంచడానికి నాకేమీ కనిపించడం లీదు. మీరు విధంగా అయితే బావుంటుందో సూచించగలరు.
2) “చంద్రహారం, పాండవ వనవాసం, కాళిదాసు ఇవేవీ ఎన్ని సార్లు చూసినా నన్ను ఇంప్రెస్ చెయ్యలేదు”.
మీరు గుండమ్మ కథని కూడా ఈ list లో చెరుస్తారా? ఎక్కాడో చదివాను, “best selling author” కి “best author” కి చాలా తేడా ఉందని. మీ point of contention ఇదేనా?
(digression: చాలా విషయాల్లో పాత సినిమాల్లొ, camera పనితనాన్ని ఎక్కడా పూర్తిగా వాడూకున్నట్టు నాకు కనిపించదు. దీనిపై “నాటక రంగ” ప్రభావం ఉందని నా నమ్మకం. తిమ్మరుసు లోనే, NTR ని జాగ్రతాగా గమనిస్తే, అయన movements, camera ని reference గా తీసుకొని design చెయ్యబడినవి కనిపిస్తాయి. అంటే camera almost static. వీటికి ఆ రోజుల్లో ఉండే సాకేతిక ఇబ్బందులు కారణం అయి ఉండవచ్చు)
3)
ఈ సినిమాలోని, గుండమ్మకథలాంటి సినిమాలోనె, చాలా సీన్లు విసుగు తెప్పిస్తాయి. కాని వాటి ప్రాతిపదికగా )
3) “In general, subtlety ఏ మాత్రమూ లేని ఎన్.టి.రామారావు తదితరుల మొరటు పౌరాణిక నటన grossగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే రంగారావు ఒక్కడే గొప్ప నటుడనిపిస్తుంది”
“gross” అన్నది కొంచం overstatement ఏమో! NTR mass appeal ఉన్న కథానాయకుడు. అలాగే, నేను ఇంతకుముందు చెప్పినట్టు, నాటక రంగ ప్రభావం ఎక్కువగా ఉండి ఉండవచ్చు (w.r.t exaggerated, dramatized expressions). ఇది కూడా నేను ఎదో web పత్రిక లో చదివినది. ఆరోజుల్లో, సినెమా ప్రదర్స్ంచే theatres screens, sound system వంటివి అంత గొప్పగా ఉండకపోవడం వలన, పెడ బొబ్బలు, dramatized expressions అనివార్యమైయ్యెవని.
మీరు లేవనెత్తిన ప్రశ్నలకు, మిగతా నవతరంగం సభ్యులు కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారని ఆశిస్తున్నాను.
అసంఖ్య says:
contd. ఈ సినిమాలోని, గుండమ్మకథలాంటి సినిమాల్లో కూడా, చాలా సీన్లు విసుగు తెప్పిస్తాయి (ముఖ్యంగా, గుండమ్మకథలో, జమున ANR కి అమృతాజనం రాసే దృశ్యం. దీన్ని “gross” అని మీరంటే, నేను మీతో ఏకీభవిస్తాను
).
కాని, అవి అప్పటి ప్రజల ( ఉరుకులు-పరుగులు లేకుండా, కొంచం ఓపిక ఎక్కువ గల) జీవనశైలి కు కి తగినవిధంగా ఉండెవని నా అభిప్రాయం. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా, మనం అప్పటి కళాకారుల్ని “కళ” లేని వారిగా జమకట్టడం ఎంతవరకు సమంజసం?
MayaBazar says:
As per my point of view, The BEST Directors in SwarnaYugam (ranking: top to bottom):
1. B.N. Reddy
2. K.V. Reddy
3. Kamalakara Kameswarao
4. P. Pullaiah
5. C. Pullaiah
6. C.S. Rao
7. Adurthi Subbarao
8. B. A. Subbarao
9. K. Viswanath
10. Jandhyala
Let me know if I missed anyone!