“మెలొడీ” అనే మాట వినగానే సినీ సంగీతాభిమానులందరూ ఏకాభిప్రాయంతో తల్చుకునేది సాలూరు రాజేశ్వర రావు గారిని అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. శాస్త్రీయ సంగీతంలో దిట్ట అయిన ఆయన శాస్త్రీయ, లలిత సంగీతాల సమ్మేళనంగా ఆణిముత్యాల్లాంటి మధుర సినీ గీతాలను అసంఖ్యాకంగా మనకి అందించారు. అనేక ప్రయోగాలను చేశారు. కొన్ని గీతాలను ఇంగ్లీష్ గీతాలనుంచి ప్రేరణ పొంది కొద్ది చాయలతో మాత్రమే వాటిని అచ్చ తెలుగు పాటలుగా మలిచారు. పాశ్చాత్య సంగీత ధోరణులను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. చంద్ర లేఖ సినిమా ఇందుకు ఒక ఉదాహరణ.
ఆలిండియా రేడియోకి సోలో గానూ, రావు బాల సరస్వతి తోనూ కలిసి ఆయన పాడిన లలిత గీతాలు 1940 ల్లో యువ హృదయాలను ఉర్రూతలూగించాయి. “పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల”…”చల్ల గాలిలో యమునా తటిలో..” “ఓ యాత్రికుడా..” వంటి పాటలు ఈ నాటికీ ఆయన సంగీతాన్ని అభిమానించే వారికి గొప్ప ఆస్థి కిందే లెక్క! స్త్రీ స్వరపు పోలికలు కలిగిన సన్నని స్వరంతో ఆయన పాడిన లలిత గీతాలు ఆలిండియా రేడియో పుణ్యమా అని సంగీతాభిమానుల దాహార్తి తీర్చాయి.
సినిమాల్లో ఆయన ప్రావీణ్యం కొత్త పుంతలు తొక్కి, మెలొడీకి పెద్ద పీట వేయడమే కాక, కొన్ని సినిమాలను ఈ నాటికీ మ్యూజికల్ హిట్లు గా నిలబెట్టింది.తెలుగు సినిమా సంగీతాన్ని ఆరాధనీయమైన స్థాయికి తెచ్చింది రాజేశ్వర రావు గారేనన్నా అతిశయోక్తి కాదు.
సినిమా పాటలకు బాణుల్ని సమకూర్చే విషయంలో రాగాలతో ఆయన అలవోకగా ఆడుకున్నారు. రాగ లక్షణాన్ని కూడా మార్చేసి దుఃఖాన్ని స్ఫురింపజేసే రాగంలో నృత్య గీతాలకు కూడా బాణీలను కట్టారు. అలాంటి అచంచల ప్రయోగాల్లో మచ్చుకు కొన్ని….
నిజానికి మోహన రాగానికి శాస్త్రీయ సంగీతపరంగా విస్తృతమైన పరిథి లేదనే చెప్పాలి. అది ఆయన అభిమాన రాగం! మధుర మధుర
మోహన లో ఆయన కూర్చిన కొన్ని పాటలు…
మీ తీయని రేయి(విప్రనారాయణ)
తెలుసుకొనవె యువతి,(మిస్సమ్మ)
ధీర సమీరే(జయదేవ)
మదిలో వీణలు మోగే(ఆత్మీయులు)
వినిపించని రాగాలే(చదువుకున్న అమ్మాయిలు) అన్నీ వైవిధ్యమైన పాటలే!
హిందోళం లో రాజేశ్వర రావు గారు చేసిన పగలే వెన్నెల (పూజాఫలం), ఆల్ టైం హిట్ గా నిలిచిన భావగీతం. ఇదే రాగంలో కూర్చిన శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం)పాటేమో భక్తి రసంతో పాటు వీర రసం కూడా ఉట్టిపడే గీతం.
రాగమాలిక(వివిధ రాగాలను వివిధ చరణాల్లో ఒకే పాటలో కూర్చడం) లో స్వర రచన చేయడం క్లిష్టమైన పని! మల్లీశ్వరి లోని ‘ఆకాశవీధిలో ‘ ఎవరు మర్చిపోగలరు?
జయదేవ చిత్రంలోని దశావతారాలను వర్ణించే అష్టపది “జయ జగదీశ హరే “, “పాడెద నీ నామమే”(సినిమా పేరు తెలీదు) ,
రాధాకృష్ణ సినిమాలోని “నా పలుకే కీర్తనా” పాటలు ఆయన రాగమాలికలకు కొన్ని ఉదాహరణలు!
ఇక వీణ రాజేశ్వర్రావు గారి వీణ పాటలంటే ప్రాణం ఇవ్వని అభిమానులెవరు?
పాడవేల రాధికా
పాడమని నన్నడగవలెనా
మదిలో వీణలు మ్రోగే,
పాడెద నీ నామమే…ఇవన్నీ ఆయన వీణా నాదాలే!
యమన్ కళ్యాణి రాగంలో రాజేశ్వర రావు గారు ఇచ్చిన హిట్లు అసంఖ్యాకం!
ప్రతి తెలుగు గొంతులో ఎప్పుడో ఒకప్పుడు పలికే పాట “మనసున మల్లెల మాలలూగెనే” సావిరహే తవదీనా,రారా నా సామి రారా (విప్రనారాయణ)
చెలికాడు నిన్నే(కులగోత్రాలు)
జగమే మారినది(దేశద్రోహులు)
చిగురులు వేసిన కలలన్నీ(పూలరంగడు)
కళ్లలో పెళ్ళి పందిరి(ఆత్మీయులు)
ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యాలే!
అలాగే పాశ్చాత్య సంగీత ప్రేరణతో వాటిని మక్కీకి మక్కీ దించకుండా “ఎక్కడో విన్నట్టుంది” అన్నట్టుగా వాటిని “తెలుగైజ్” చేసి కూర్చిన పాటల్లో కొన్ని..
హలో హలో ఓ అమ్మాయి(ఇద్దరు మిత్రులు)
స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు(ఆత్మీయులు)
ఈ రేయి తీయనిది (చిట్టి చెల్లెలు)
రాజేశ్వర రావు గారు ఈ పాటలు కూర్చారనో, ఆయన ఇంతటి ప్రతిభాశాలి అనో,ఆయన పాటల్లో ఇవి మంచివి అనో చెప్పడం పెద్ద సాహసమే ! అక్టోబర్ 25 న ఆయన వర్థంతి సందర్భంగా ఒక్క సారి ఆ పాటల మాధుర్యాన్ని తల్చుకునే చిన్ని ప్రయత్నమే ఇది.
అందుకే ఆయన్ని ర ‘సాలూరు ‘ రాజేశ్వర రావు అన్నా, రాజే”స్వర” రావు అన్నా, అది ఆయనకే చెల్లు!
-సుజాత (మనసులో మాట)
K మహేశ్ కుమార్ says:
మంచి వ్యాసం. నామిని గారికి బాపు రాసిన లేఖలో ఈ మహానుభావుడి గురించి ఒక మాట చెబుతారు…”రాజేస్వర రావు గారు పాడగానే tune OK అయిపోయేదిట. అదే వరస recording జరుగుతున్నప్పుడు మరొకరు పాడుతుంటే- ఈ వరసా మనం OK చేసింది! అని నిర్మాతా దర్శకుడూ మొహామొహాలు చూసుకునేవారట” అని. ఈ మహానుభావుడి గొంతులోనూ ఆ మహత్యముండేదని ఇంతకన్నాబాగా ఎవరూ చెప్పలేరేమో!
సాలూరివారి వర్థంతి సందర్భంగా ఈ వ్యాసాన్ని అందించి, ఆయన్ను తలుచుకునే అవకాశం కల్పించినందుకు అభినందనలు.
సుజాత!(మనసులో మాట) says:
పై వ్యాసంలో నాకున్న కనీస సంగీత పరిజ్ఞానంతో కొన్ని రాగాల ఆధారంగా పాటలను పేర్కొన్నాను. స్వరం ఒక్కటి మారినా రాగం మారుతుంది. తప్పు గా ఏవైనా రాగాలను, పాటలను జత కూర్చి ఉంటే తెలిసిన వారు ఎత్తి చూపగలరు.
శిద్దారెడ్డి వెంకట్ says:
చాలా బావుంది.
ఈ రోజు ఆ మహానుభావుణ్ణి గుర్తు చేసినందుకు సుజాత గారికి ధన్యవాదాలు.
pappu says:
రసాలము అంటే మామిడి పండు. రశోవైశుడు అని శివుడ్ని పిలుస్తారు. ఒక దాంట్లోంచి రసాలు వూరుతుంటే మరొకరు భావ సంగీతానికి అధిపతి గా చెప్పుకొంటే…ఆ రొండూ కలిసివచ్చేట్టు పేరు కలిగిన ర”సాలూరు” రా”జేస్వరుడు” మన తెలుగు సంగీతానికి దొరికిన ఆణి ముత్యం, కోహినూర్ వజ్రం. రసాలూరే వారి సంగీత సముద్రంలో ఓలలాడె అవకాశం మనకి కూడా దక్కినందుకు ఈ సందర్భంగా వార్ని స్మరించుకునే అవకాశం చిక్కినందుకు..అది అంద చేసినందుకు సుజాత గారికి శత సహస్ర వందనాలు…అభివందనాలు.. మనమూ…మన తెలుగు జాతి చెసుకున్న అదృష్టం..ఆయన తెలుగు వారు గా జన్మించడం…
మాలతి says:
చాలా మంచి వ్యాసం. మరోకసారి పాతజ్ఞాపకాలను గుర్తు చేసింది. రాజేశ్వరరావుగారు షికాగో వచ్చినప్పుడు ఆయన పాడిన మనసునమల్లెలమాలలూగెనే అపురూపంగా ఇప్పటికీ దాచుకున్నాను. థాంక్స్. సుజాతా.
నవీన్ గార్ల says:
వికీలో కూడా ఈ వ్యాసాన్ని చదవండి:
http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81
సుజాత!(మనసులో మాట) says:
అదృష్ట వంతులు మాలతి గారు, లైవ్ పాటని దాచుకోగలిగారు. అంతే కాదు, నేను ఒక్లహోమా లో ఉన్నపుడు మీరు అడిగారని ‘చల్ల గాలిలో యమునా తటిపై..” పాట లిరిక్స్ రాసి మీకు పంపాను.గుర్తుందా!
సుజాత!(మనసులో మాట) says:
నవీన్ గారు,
వికీ లో వ్యాసం చాలా సమగ్రంగా, చాలా సమాచారాత్మకంగా ఉంది. నేను ఆయన మీద ఉన్న అభిమానంతో వివిధ రాగాల ఆధారంగా ఆయన చేసిన స్వర విన్యాసాల గురించి మాత్రమే కొంచెం రాసాను.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
సరే..ఇంతమంది రాస్తున్నప్పుడు…
రాజేశ్వరరావు గారు కన్నుమూసినప్పుడు ఒక దినపత్రికలో నేనూ నివాళులు అర్పించా,పైగా అక్కడ నేను వ్యక్తం చేసిన ఒక అనుమానం వల్ల తర్వాతి కాలంలో ఆయన జీవితవిశేషాలు పేర్కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించుకుని మరీ రాయాల్సిన స్థితి తద్వారా కలిగింది.ఆ పేపరు క్లిప్పింగులను(మాలతి గారు ఆడియో)దాచుకున్నట్లు చాలా పదిలంగా దాచాను:)
పరుచూరి శ్రీనివాస్ says:
Agreeing *and* appreciating that its only a brief tribute to the maestro on the eve of his death anniv. ….
<>
ఆ పై రెండువాక్యాలు పక్కపక్కన పొదగడంలేదు, నా దృష్టిలో. చంద్రలేఖ సినిమా 1948లో వచ్చింది. దానిలో స్పానిష్, లాటిన్అమెరికన్, పోర్చుగీస్ సంగీత ధోరణులు చాలా గొప్పగా మనకు అందించారు అని మరల చెప్పనక్కర్లేదు. పోతే, “తొలిసారిగా పాశ్చాత్య…” అంటే, 1936 లో “శశిరేఖాపరిణయం (మాయాబజార్)” అనే ఒక సినిమా వచ్చింది. దానిలోను “వివాహ భోజనంబు” పాట వుంది. 1957 వెర్షన్ కు ఆ పాత పాటకు పెద్దగా తేడా వుండదు. ఆపాటలో *బోలేడు* తెలుగుదనం వున్నా, ఆ నడక “పాశ్చాత్యమే”.
కాస్త నా మొహమాటం, మోడెస్టీ పక్కన పెడితే
గతంలో సాలూరిపైన కాస్త పొడుగాటి వ్యాసం రాసాను(*):
http://www.eemaata.com/em/issues/200003/752.html
ఆ వ్యాసం, తప్పులతో సహా వికీలోకి యధాతధంగా యెక్కిందని మాత్రం ఇప్పుడే గమనించడం. వికీ నిర్వాహకులు దిద్దుకోగలరు.
<>
అక్కడ: “కోకిల పాట – ఈ మానుపైనుండి నీవు, ఆ మానుపైనుండి …” అని వుండాలి.
“కోయిలొకసారొచ్చి కూసిపోయింది” కూడా సాలూరి పాటే (ఇల్లాలు, 1940). తెలుగు పాటకు పాశ్చాత్య బాణీని యెలా జతపరచవచ్చో “ఇల్లాలు” ద్వారా, ముఖ్యంగా ఈపాట ద్వారా గొప్పగా చూపెట్టాడు.
భవదీయుడు,
శ్రీనివాస్
(*) A revised version was later published in a print magazine.
Priya Iyengar says:
very nice post. I ,like Malleeswari songs. I once read – a lady writer claimed (probably in Andhra Jyothi) that she did composed the song పిలచినా బిగువటరా…! is that right?
Priya Iyengar says:
i can’t remember her name. did anybody read that article?
పరుచూరి శ్రీనివాస్ says:
Dear Ms. Iyengar,
The person you are referring to is Vinjamuri (avasaraala) Anasuya of seeta-Anasuya fame. And the song in question is not “పిలిచిన బిగువటరా” but “మనసున మల్లెల మాలలూగెనే”.
Regards,
Sreenivas