కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’

రచయిత: K మహేశ్ కుమార్ |ప్రచురణ: July 15, 2008 at 1:33 pm

జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.  1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన సామాజిక వాతావరణంకూడా ఒక defense mechanism లాగా ఏర్పడిన తరుణం అది. ఇలాంటి సున్నితమైన సామాజిక పరిస్థితి మధ్య ఇలాంటి సినిమా తియ్యడం ద్వారా విశ్వనాధ్ గారు సినిమాకున్న సామాజిక బాధ్యతతోపాటూ, ఒక దర్శకుడిగా తన సామాజిక నిబద్ధతనూ పరిచయం చేసారు.

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పెళ్ళికి ముందే ఒక హరిజనుణ్ణి ప్రేమిస్తే, సాంప్రదాయక వివాహానంతరం కూడా ఈ విషయం తెలిసిన  భర్త, తాత ఆ అమ్మాయిని తన ప్రేమికుడితో కలపడం అనేది ఈ చిత్రకథ. నాయిక ‘హేమ’ (భమిడిపాటి సబిత), నాయకులు ‘హరిబాబు’ (రవికాంత్) ప్రేమికులుగనక వారినే ప్రముఖపాత్రధారులని చెప్పలేని కథనం ఇది. అందుకే ఈ సినిమాలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ (screen space) కూడా లేని ఆ అమ్మాయి భర్త గౌరీనాధుడు (గిరీష్), శంకరాభరణం శంకరశాస్త్రి పంధాని మరికొంత ముందుకునడిపిన తాత ‘యాజులు’ (జె.వి.సోమయాజులు) ప్రముఖపాత్రలుగా ఉద్భవిస్తారు. వీరి కోణం నుంచీ ప్రేక్షకుడికి సినిమాలో చెప్పదలుచుకున్న సందేశం అందించబడుతుంది. అందుకే, ‘సప్తపది’ ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో చెప్పబడిన కులాంతర వివాహం కథ అని సూత్రీకరించడం జరిగింది.

సినిమా ప్రారంభంలోనే ఈ చిత్రనిర్మాణ స్ఫూర్తిని గురించి దర్శకుడు విశ్వనాధ్ చెబుతూ, ” ‘ఆచారవ్యవహారాలన్నవి మనసును క్రమమైన మార్గంలో పెట్టడానికేతప్ప, కులమనే పేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు’ అన్న శంకరాభరణం శంకరశాస్త్రి మాటలే ఈ చిత్రనిర్మాణానికి ప్రేరణ” అని చెబుతారు. తను ఇంతకు మునుపు సృష్టించిన ఒక పాత్ర చెప్పిన మాటే ప్రేరణగా, మరో ఆణిముత్యం లాంటి సినిమాకు రూపకల్పన చెయ్యడం, కళాతపస్వి అని పిలువబడే ఈ కళాకారుడికే చెల్లు.

సప్తపది చిత్రం సంగీతపరంగా (కె.వి.మహదేవన్), సాహిత్య పరంగా (వేటూరి సుందరరామ్మూర్తి) ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి పాటా ఒక ఆణిముత్యం వాటిల్లోని ప్రతి భావం ఒక నిత్య సత్యంలా అనిపించే సంగీతసాహిత్యాలు ఈ సినిమా సొత్తు. ఇక ఈ చిత్రంలో ఆచితూచిసాగే మాటలు (జంధ్యాల) కూడా చెప్పుకోదగ్గవే. వ్యాసం యొక్క విషయం ‘బ్రాహ్మణ ధృక్కోణం’ కాబట్టి,వాటికి సంబంధించినవాటిని మాత్రమే సమగ్రంగా చర్చించి, మిగతావాటిని కేవలం ఉటంకించడం మాత్రమే జరుగుతుంది.

కథా పరంగా మొదట్లో చెప్పినట్లు, ఈ చిత్రానికి ప్రధాన పాత్రధారి యాజులైతే, కథానాయకుడు మాత్రం గౌరీనాధుడని చెప్పుకోవాలి. ఇక కథనం మరియూ పాత్ర కల్పనలని దృష్టిలో ఉంచుకుంటే, సినిమా ఆఖరికి వాంఛితమైన మార్పుకూడా యాజులు పాత్రలో వస్తే, గౌరీనాధుడు బ్రాహ్మణత్వం (బ్రహ్మజ్ఞానము తెలిసిన) మూర్తీభవించిన నాయకుడిగా గోచరిస్తాడు. ఇక ఇతర పాత్రలు చాలావరకూ అటు యాజులు మరియూ నాయిక హేమ కుటుంబ సభ్యులు కనుక, అంతా బ్రాహ్మణులే అని చెప్పుకోవచ్చు. పోతే మరో ప్రముఖపాత్ర ‘రాజుగారు’ (అల్లు రామలింగయ్య). రాజుగారి పాత్రని పరిచయం చేసినప్పుడే, అతను యాజులకి ఆప్తమిత్రుడితోపాటూ, మనస్సాక్షిగా (conscious keeper ) కూడా అనిపిస్తాడు దర్శకుడు.   కానీ,  అసలు సమస్య ‘హరిజన’ కథానాయకుడి పాత్ర సృష్టిలో గోచరిస్తుంది.

ప్రేమకథ అన్న తరువాత నాయికా నాయకుల వ్యక్తిత్వాలూ, ఇష్టాఇష్టాలూ, పరిచయ-ప్రణయాలూ సినిమాలో చూపడం సహజం. కానీ సప్తపది చిత్రంలోని భావుత్వం తొణికిసలాడే విశ్వనాధ్ గారి కథనంలో, కొంత అసృష్టత కనిపిస్తుంది. అదీ ముఖ్యంగా నాయకుడి పాత్ర సృష్టిలో. అతనెవరో? ఎక్కడ్నించి వచ్చాడో? గుణగణాలేమిటో? ఖచ్చితంగా చెప్పగలిగే ఆధారాలు సినిమాలో కనిపించవు. ఒక నాట్య ప్రదర్శనలో పిల్లనగ్రోవి ఊదుతూ ప్రత్యక్షమై, గోదారి ఒడ్డున ఒక మంటపం దగ్గర వేణువు వాయిస్తూ నాయికకు పరిచయమై, ఆభేరీరాగాన్ని ప్రేమలేఖగా పంపి, సంగీతంతో నాయిక మనసుదోచుకుంటాడు. “రేపల్లియ ఎదఝల్లున పొంగిన మురళి” అనే పాటలో నాయిక తండ్రిని మంచిచేసుకుని నాయికకు దగ్గరౌతాడు. అంతా బాగుందన్న తరుణంలో “నేనొక హరిజనుణ్ణి” అని ఒక గొల్లపిల్లవాడితో చెప్పి, నాయికకు తెలిసేలా చేస్తాడు. ఇప్పటివరకూ, ‘పోనీ కథానాయకుడే నిజాన్ని దాచాడుకాబట్టి, ఇలా చిత్రించడం సరే’ అని సరిపెట్టుకునేంతలో మరికొన్ని, అసంభద్దాలు కనిపిస్తాయి.

“చిన్నప్పటి నుంచీ, ఏంచేసైనా నేను అనుకున్నది సాధించే తత్వం నాది” అని ప్రశ్నించిన నాయికతో అంటాడు నాయకుడు. దీనికి తోడు తను మోసంతో ఎలా వేదం, సంగీతం నేర్చుకుందీ తప్పుచేసినవాడిలా చెప్పుకొచ్చిన నాయకుడు, చివరిగా “ఇన్నాళ్ళూ అబద్ధాలలోనే బ్రతికాను. ఎవర్నీ అన్యాయం మాత్రం చెయ్యలేదు” అని సత్యం పలుకుతాడు. ఈ వివరణలో బ్రాహ్మణత్వాన్ని ఆశించే ఒక యువకుడు కనబడతాడేతప్ప సమాజానికి ఎదురుతిరిగిన హరిజనుడు కనపడడు. బహుశా, అప్పటికి దళితవాదం ప్రాచుర్యంలో లేకపోవడం వలన కథా రచయితకు (కె.విశ్వనాథ్) హరిజనుడు తిరుగుబాటు చేస్తే ‘బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా చేస్తాడేకానీ, బ్రాహ్మణత్వంకోసం చెయ్యడు’ అన్న విషయం తెలిసుండకపోవచ్చు. లేకపోతే చివరిలో యాజులు చెప్పే “భగవంతుడు గుణగణాల్ని బట్టి నాలుగు కులాలు నిర్ణయించానన్నాడుగానీ, పుట్టుకనిబట్టి కాదు” అనే ఆర్యోక్తికి సరితూగేలా నాయకుణ్ణి ‘కర్మ బ్రాహ్మణున్ని’ చెయ్యడానికి అతని చేత (దొంగతనంగా) వేదం, సంగీతం నేర్పించడానికి పూనుకొనుండోచ్చు.

దీనికి తోడు, నాయకుడితో నాయికను ఒక విచిత్రమైన కోరికని కోరనిచ్చి అతని మీద కలిగే కాస్తోకూస్తో సానుభూతి కాస్తా హరించినట్లనిపిస్తుంది. కులాల పట్టింపులూ, నాయిక యొక్క నాన్నగారి విధివిధానాలను చూసినవాడై, మనసులు ఒకటైనా మనుషులు కలవరనే నిర్ణయానికొచ్చిన నాయకుడు, “నువ్వు ఎవరి సొత్తూ కాకూడదు. నేను కట్టుకునే ఆలయంలో, నువ్వు నాదేవతలా ఉండిపోవాలి. నేనాదేవతని ఆరాధిస్తూ,ఇలా బ్రహ్మచారిగా రాలిపోవాలి” అని నాయికను కోరి ఒప్పిస్తాడు. వినడానికి ఎంత ఉదాత్తంగా అనిపించినా చాలా అసంబద్ధమైన కోరిక అని మాటల రచయితకు తెలిసుకాబట్టే, ఈ కోరిక కోరేముందు “నిన్ను ఒక విచిత్రమైన కోరిక కోరతాను” అని నాయకుడిచేత అనిపిస్తాడు. ఇంకా విచిత్రమేముటంటే, ఈ చిత్రంలో కథానాయకుని పేరు ఒక్క గొల్లపిల్లవాడుతప్ప ఎవ్వరూ ఉచ్చరించరు. కొన్ని సమీక్షల్లోకూడా నాయకుడి పేరు (ఫ్లూట్ వాయిస్తాడుకాబట్టి) ‘మురళి’ అని రాయగా చదివాను. కానీ సినిమాలో అతని పేరు ‘హరిబాబు’.

సహజీవనం చెయ్యడానికి ధైర్యం చెయ్యలేని నాయికా నాయకులు.  ప్రేమించినా, పెళ్ళికినోచుకోక ఆరాధిస్తూ బ్రతికేద్దామనుకునే హీరోహీరోయిన్ల ప్రేమకథని ఇలా నడిసంద్రంలో నిలిపి, హేమకు గౌరీనాధుడితో (యాజులు ద్వారా) పెళ్ళి నిశ్చయిస్తాడు దర్శకుడు. ఈ పెళ్ళినిర్ణయానికి ఒక్క సీన్ ముందే, ప్రేమికులని సంతానవృక్షం దిశగా సప్తపది నడిపి, సినిమాకథకు ఒక పీటముడికూడా వేస్తాడు. ఇక్కడినుండీ మొదలవుతుంది అసలు నాయకుడు గౌరీనాధుని కథ.

హరిబాబు ఈ పెళ్ళితరువాత తెలియని చోటుకి తన విరహాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతే, హేమ పెళ్ళిని అంగీకరించి గౌరీనాధునికి భార్యగా నిలబడుతుంది. కాకపోతే “పరస్త్రీ తల్లితో సమానమని మనసావాచా నమ్మిన” గౌరీనాధుడికి, శోభనంరోజు రాత్రే హేమ అమ్మవారిలా కనబడుతుంది. హరిబాబు- హేమల ప్రేమ, సంతానవృక్షానికి ఊయలకట్టిన విషయం తెలుసుకున్న గౌరీనాధుడు,”నీ మనస్సు పరాధీనంలో ఉందికాబట్టి,ఇన్నాళ్ళూ నాకు నేను పూజించే అమ్మవారిలా కనిపించావు” అని చెప్పి, హరిబాబుని తీసుకొచ్చి ఇద్దరినీ ఒకటి చెయ్యడానికి బయల్దేరుతాడు. ఒకవైపు నాయికను అసంబద్ధకోరికను కోరి, పెళ్ళిచేసుకునే ధైర్యంలేని హీరో , పెళ్ళిచేసుకున్న అమ్మాయి ప్రేమ సంగతి తెలిసి, ఇద్దరినీ ఒకటి చెయ్యడానికి బయల్దేరే పాత్ర మరొకవైపు. ఇక ప్రేక్షకుడికి నాయకుడెవరో చెప్పకనే తెలుస్తుంది.

ఈ విషయం విన్న గౌరీనాధుడి తండ్రి (జె.వి.రమణమూర్తి), “పిదపకాలం పిల్లలూ, పిదపకాలం బుద్ధులూ” అని ఈసడిస్తే, అంతవరకూ సాంఫ్రదాయం కట్టుబాట్లూ అని కటువుగా కనిపించిన యాజులు మాత్రం మౌనం వహిస్తాడు. తన మిత్రుడైన రాజుగారితో చర్చిస్తాడు. ఇటు బ్రాహ్మణులకూ, అటు హరిజనులకూ వారధిలా ఉన్న రాజుగారు, ‘శంకర విజయం’లో శంకరాచార్యుడూ,మాలవాడికీ మధ్యజరిగిన ఆత్మ-పరమాత్మల సంవాదం గుర్తుచేసి, “మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం” అని కులాల పట్టింపుల్లోని అర్థరాహిత్యాన్ని గుర్తుచేస్తాడు. దానితోపాటూ నేపధ్యగీతంలా వచ్చే “ఏకులమూ నీదంటే? గోకులమూ నవ్వింది. మాధవుడూ,యాదవుడూ నాకులమే లెమ్మంది” అనే పాటవచ్చి యాజుల మనసుపొరల్లో, కులంగురించి ఏర్పడుతున్న సృష్టతకు ఆద్ధంపడుతుంది. అంతేకాక, “ఆది నుంచి ఆకాశం మూగదీ, అనాదిగా తల్లిధరణి మూగది. నడుమవచ్చి ఉరుముతాయి మబ్బులూ, ఈ నడమంత్రపు మడుసులకే మాటలు. ఇన్ని మాటలు” అని లోకులకు కులం గురించిఉన్న పట్టింపులు ఎంత మూర్ఖమో దర్శకుడు తెలియజెబుతాడు.

పెళ్ళికి శాస్త్రోక్తమైన అర్థం  తెలిసిన యాజులు ఈ అంతర్మధనంలో సత్యాన్ని బేరీజుచేసుకుని, హేమను హరిబాబుతో సాగనంపడానికి చీరసారెతో బయల్దేరుతాడు. అప్పటివరకూ చాటుగా చెవులు కొరుక్కున్న జనం, ఇప్పుడు మూకుమ్మడిగా దీనికి వ్యతిరేకంగా కర్రలుపట్టుకుని నిలబడతారు. అప్పుడు వారడిగిన ప్రశ్నలకి శాస్త్రాన్ని ఉదహరిస్తూ యాజులు అందరి (ప్రేక్షకుల) కళ్ళూ తెరిపిస్తాడు. “పెళ్ళంటే ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు. ఇద్దరి మనస్సుల్ని కలపడం”. “త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెబుతోది”. ఇన్నేళ్ళూ కొడుకులా పెంచుకున్న నా కూతురిని నీకొడుకుకి అప్పజెబుతున్నాను. వాళ్ళిద్దరూ స్నేహంగా, సఖ్యతగా ఉండుగాక” అని కన్యాదాత కన్యాదానం చేస్తూ అంటాడని. అయితే “ఆ స్నేహం, సఖ్యత లోపించిన తరువాత” వారు కలిసి ఉండడం మంచిది కాదనీ, అందుకే “ఆ సఖ్యతకు అర్హుడైన” వాడితో అమ్మాయిని పంపిస్తున్నాననీ తెలియజెబుతాడు.

అంతావిన్న ప్రజలు వెనక్కితగ్గితే, గౌరీనాధుడు తీసుకొచ్చిన హరిబాబుతో హేమని స్వయంగా సాగనంపడానికి పడవెక్కుతాడు యాజులు. గౌరీనాధుడు రేవులో నిలబడుండగా పడవ సాగిపోతుంది. సంగీతం, నాట్యం వారికులమనీ, సప్తస్వరాలే వారికి సప్తపది అని ఒక కంఠస్వరం నేపధ్యంలో చెబుతుండగా సినిమా ముగుస్తుంది.

కులాంతర వివాహమనే విషయాన్ని తనదైన కోణంలో ఆవిష్కరించడంలో దర్శకుడు కె.విశ్వనాధ్ చాలా వరకూ సఫలమైనా, కథకుడిగా తనకుగల కొన్ని హద్దుల్ని (limitations) దాటడంలో సఫలం కాలేదు అనిపిస్తుంది. అందుకే తనకు తెలియని/అర్థంకాని కొన్ని పాత్రల్ని అసంపూర్ణంగా వదిలి కథను నడిపించాడు. అంతేకాక గౌరీనాధుడికి హేమ అమ్మవారిలా కనిపించడానికీ, నాయిక సంతానవృక్షానికి ఊయలకడుతున్నప్పుడు నాయకుడు  ” మనమిద్దరం ఒకటవ్వడానికి ఈ మూఢాచారాలూ, వింతనమ్మకాలూ అడ్డుపడుతున్నాయి. ఈ చెట్టుకే అంతటి మహిముంటే, పెద్దల మనసుల్ని మార్చి మనల్ని కలుపుతుందేమో చూద్ధాం” అన్నదానికీ ఒక సింబాలిక్ లంకె కలిపి, గౌరీనాధుని నిబద్ధతకూ కొంత supernatural గ్రహణం పట్టించినట్లనిపిస్తుంది. తనకుతెలిసిన బ్రాహ్మణదృక్కోణంలో మహత్తరంగా ఈ సమస్యను ఎత్తిచూపినా, ఒక కూలంకష సామాజిక సమస్యగా దీన్ని మలచడంలో దర్శకుడు సఫలుడు కాలేదేమో! అనిపిస్తుంది.

సప్తపది ఒక మంచి సినిమా, విశ్వనాధ్  గారు చాలా మంచి దర్శకులు. కానీ, భారతదేశ సినిమా జగత్తులో “గొప్ప” దర్శకుల జాబితాలో ఈయన చేరకపోవడానికిగల కారణాలు ఈ చిన్నచిన్నలోపాలే అనిపిస్తుంది. He is a very good director who falls short of greatness. మన తెలుగు సీనీమతల్లికి మహత్తరమైన, మంత్రపుష్పాల్లాంటి సినిమాల్ని అందించిన ఈ దర్శకదిగ్గజం మనకుమాత్రం ఎప్పటికీ గొప్పదర్శకుడే!

Tags: , , ,

32 Comments

  1. అభినందనలు.
    చాలా మంచి వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు.

  2. హరిబాబు కోరే వింత కోరికలో నాకు గోచరించిన అర్ధం వేరేగా ఉంది. హేమ మనసులో స్ధానం సంపాదించడమే కానీ దానిని అడ్వాంటజిగా తీసుకొని హేమకు కుటుంబ పరంగా ఇబ్బంది కలిగించడం కాదు. తన పరిధిలో తనకు తోచిన సొల్యూషన్ అదే. తనున్న పరిస్ధితుల్లో అదే సరైనదిగా అనిపించొచ్చు. హేమ కూడా హరిబాబును అతని మురళీ గానం, అతని మాటల్లో ఉట్టిపడే సంస్కారం ఆధారంగా తన కులానికి చెందినవాడే అనే భావంతో ప్రేమిస్తుందే కానీ, ముందుగానే అతను హరిజనుడని చెప్పుండుంటే అసలు చూసేది కాదేమో అనిపిస్తుంది… ఇక మీరు చెప్పిన హీరొయిజం అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుందేమో. మామూలుగా ఏ కధకైనా అంతిమ ఫలితం ఎవరు పొందుతారో వారే హీరో అని ఎక్కడో చదివాను. దీని ఆధారంగానే మహాభారత కధకు ధర్మరాజును హీరోగా చెప్తారంట (అర్జుండు, కృష్ణుడు ముఖ్య పాత్రలు) … ఇదంతా ఎందుకుగానీ ‘సప్తపది ‘ ని మల్టీస్టారర్ అనుకుంటే పోలా!

    ఇలాంటి కాన్సెప్ట్‌తో విశ్వనాధ్‌గారు శోభన్ బాబు , శారదల కాంబినేషన్‌లో ఒక సినిమా తీసి ఉన్నారు. ఆ సినిమా పేరు ఏంటో సరిగ్గా గుర్తులేదు కానీ చాలా బావుంటుంది. ఐతే ఈ సినిమాలో ఉన్నంత సీరియస్‌గా ఉండదు. అందులో శారద కూడా తమ కులమనే భ్రమను తన తల్లి సూర్యకాంతానికి కలిగిస్తాడు శోభన్. ఎవరికైనా సినిమా రేరు తెలిస్తే తెలియపరచగలరు.

  3. శంకర్ గారు,మీరు అడిగిన ఆ సినిమా పేరు కాలంమారింది

  4. @రాజేంద్ర కుమార్ దేవరపల్లి
    THANX

  5. @శంకర్; హరిబాబు కోరికని క్రిందరాశాను, పూర్తిగా చదవండి. ఆతరువాత దానిలోని మొదటి వాక్యాన్ని గమనించండి.

    “నువ్వు ఎవరి సొత్తూ కాకూడదు. నేను కట్టుకునే ఆలయంలో, నువ్వు నాదేవతలా ఉండిపోవాలి. నేనాదేవతని ఆరాధిస్తూ,ఇలా బ్రహ్మచారిగా రాలిపోవాలి”

  6. మహేష్ కుమార్,

    మీరు శ్రమపడ్డా, నిరాశ కలిగించిన సమీక్ష.

    కొన్ని నా మాటలు.

    విశ్వనాథ్ ఏ సినిమాలో కూడా హీరోలకి పెద్ద పెద్ద మెలోడ్రామా ఇంట్రొడక్షన్లు ఉండవు. హీరో ఫలానా వాడు అనే డైరక్టుగా చెప్తారు. సిరివెన్నెల అయినా, సిరిసిరిమువ్వ అయినా, స్వాతిముత్యం అయినా సరే. ఇక్కడ హీరో హరిజనుడు అన్నది ముఖ్యం, మిగతావన్నీ అప్రస్తుతం.. ఇంతా చేస్తే ఇదేం కమర్షియల్ సినిమా కాదుకదా.

    <>

    దళితవాదం అప్పుడూ ఉంది, హింసతో కూడినదే అప్పుడు లేదు. అయినా మీరెలా జనరలైజ్ చేస్తారు అందరు దళితుల పక్షానా? అసలు హీరో చేసింది తిరుగుబాటా? నాకర్ధం కాలేదు. ఏదో ఆ సంస్కృతీ సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకున్నాడు, ధైర్యంగా నేర్పే వారు లేక దొంగతనంగా నేర్చుకున్నాడు. కథ ప్రకారం అంతే. ఇక్కడ తిరుగుబాటేముంది? అయినా బ్రాహ్మణుడైనంత మాత్రాన అందరూ ఎలా అయితే వర్ణాధిపత్యం చూపించరో, దళితుడైనంత మాత్రాన ప్రతివాడూ తిరుగుబాట్లు చెయ్యాలనిలేదే?

    <>

    బ్రాహ్మణత్వం దళితుల్ని అణగదొక్కుతూనే ఉందంటూ బాధపడుతూ ఆక్రోశిస్తున్న వాళ్ళు, “చాతుర్వర్ణం మయా సృష్టా…” కి దర్శకుడు సూటిగా ఇచ్చిన వివరణకి రంధ్రాన్వేషణ చేసి “కర్మ బ్రాహ్మణత్వం” హీరో గారికి (దొంగతనంగా) వేదం, సంగీతం ద్వారా అబ్బినందువల్లే స్వీకరించారు అనటం ఎంతవరకు సమంజసం? ఆ చదువు కాకపోతే మరో చదువు. అంతేగానీ, హరిజనుడు కాబట్టి పారిశుద్ధ్యపనులు మాత్రమే చేసేవాడిగా హీరోని చూపెట్టి సినిమా తీయలేరుకదా. అలా చూపిస్తే అలా ఎందుకని మరో గొడవ. కులం కాకపోయినా, సంసారం సాగించే స్థోమత ఉండాలిగా ఏదో రూపంలో.

    ఇకపోతే, ధృక్కోణం విశ్వనాధ్ ది కాబట్టే, పరివర్తన ద్వారా వాస్తవాల్ని గ్రహింప చేస్తూ ముగింపు ఇచ్చారు. తిరుగుబాట్లు, హింసలూ అయితే బహుశా దళిత ధృక్పధంలో ఆర్.నారాయణమూర్తి తీయాల్సిందే. ఆశ్చర్యకరంగా, అప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇది నిజం. ఇందుకు ఆయనవి లెక్కలేనన్ని ఫ్లాపు సినిమాలు సాక్ష్యం. నా పాయింటు ఏమంటే, పెద్ద పెద్ద మెలో డ్రామాలు, డైలాగులు, హింస చూపించినా, అసలు చూసే వాడెవడు? ప్రేక్షకులా…..దళితులా……లేక మళ్ళీ ఇందులోనూ దళిత ప్రేక్షకులు అంటారా?

    ఇవ్వబోయే మందు చేదు అయినప్పుడు షుగర్ కోటింగు ఇచ్చి ఇవ్వాలి, అదే విశ్వనాధ్ చేసింది. కాదు నారాయణమూర్తి లాగా చేదు మందు బలవంతంగా నోట్లో పోస్తా బిడ్డా అంటే, రోగి కక్కుతాడు, సినిమా ఫ్లాపు అవుతుంది. డబ్బులూ పోయి, విషయం చేరాల్సినోడికి చేరక, ఎవడికి లాభం?

    అసలు బాధల్లో ఉన్నవాడికి సినిమా చూసే డబ్బులుండవు.
    డబ్బులున్న వాడికి వినోదం కావాలిగానీ మెలోడ్రామాలు కాదు.
    మరెవరయ్యా చూసేది అంటే, విమర్శకులే.

  7. హరిబాబుది స్వార్ధం కాదని నేను అనడం లేదు. ఐతే హేమను పెళ్ళి చేసుకోవడం కుదరదు కాబట్టి … ఇద్దరూ పెళ్ళి చేసుకోకుండా తమ సినిమా ప్రేమను ( అదే మూగ, పవిత్ర ప్రేమ) కొనసాగించాలని కోరుకున్నాడు. ఈ ప్రేమ చెప్పడానికి వినడానికే గానీ ఆచరించాడానికి సరిపడదనుకోండి. నేను అసలు ఆ ఆలోచననే సపోర్ట్ చెయ్యను. ఏదో సినిమాలో కారెక్టర్ పరంగా హరిబాబు మనస్తత్వానికి తగ్గట్టు ఆ కోరిక కోరడం సబబే అనిపించింది నాకు( విశ్వనాధ్ గారి సినిమాల్లో నచ్చేది ఇదే నాకు. హీరో అభిప్రాయాలు కూడా ఒక్కోసారి తప్పవుతుంటాయి ). అయినా ఇది తన మనసులోని అంతర్యాన్ని బయటపెట్టడానికి అంటాడే కానీ తను తప్పకుండా ఆచరించాలని అనుకోడు కదా. ఇక గౌరీనాధుని కేరెక్టర్‌లోని హీరోయిజం కురించి మరో కామెంటు రూపంలో నా అభిప్రాయాల్ని త్వరలోనే తెలియజేస్తాను. ఈ సినిమా చూసినప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్‌లో డిస్కస్ చేద్దామంటే ఎవరూ చూడలేదు అప్పట్లో. ఇన్నళ్ళకు మీ రూపంలో నాకు ఆ అవకాశం దొరికింది. ఇంకో సారి సినిమా చూసి నా అభిప్రాయాలతో చర్చకు వస్తా మళ్ళీ. మంచి సినిమాతో ముందుకొచినందుకు ధన్యవాదాలు

  8. @వికటకవి;
    ‘సప్తపది’ కమర్షియల్ సినిమా కాదని మీరెందుకనుకుంటున్నారు?

    హరిబాబు చెప్పిన మొదటి మాట “చిన్నప్పటి నుంచీ, ఏంచేసైనా నేను అనుకున్నది సాధించే తత్వం నాది” అని.అది తిరుగుబాటుకు చిహ్నం. తిరుగుబాటు అంటే, హింస రక్తపాతం అని మీరు అర్థం చేసుకున్నారు కాబోలు. Rebel doesn’t always mean bloodshed. It can also be rebelling against accepted norms,ideas etc.

    నేను కర్మబ్రాహ్మణుడ్ని చేసి స్వీకరింపజేయడం అన్నది ఒక ప్రతిపాదన. Its a possibility and an interpretation.నేను చెప్పిన మూల సూత్రం, విశ్వనాథ్ తనకు తెలియని హరిజన జీవితాన్ని గురించి చెప్పడంలో ఉన్న limitations ని అధిగమించడానికి కొన్ని cinematic liberties తీసుకోవడంతో పాటూ, సినిమాలో ప్రధాన విషయం కులమే కాబట్టి ఆ హీరో పాత్ర యొక్క acceptability ని పెచుకోవడానికి ఆ పాత్రను అలా సృష్టించినట్లు అనిపిస్తోంది అని.

    హరిబాబుకు ఒక కుటుంబం, నేపధ్యం ఉంటే, సమస్య మరింత జఠిలమై తను చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పలేనన్న సందేహంతో కథకుడు ఈ పనిచేసుండచ్చు అనేది నా ప్రతిపాదన. ఉద్దేశం బ్రాహ్మణదృక్కోణంలో కులాంతర వివాహాన్ని చర్చించి, తనకు తెలిసిన సత్యాన్ని చెప్పడం అన్న ఉద్దేశానికి ఆటంకం కలగకుండా పాత్రల రూపకల్పన చెయ్యడం జరిగుండోచ్చు.

    ఇకమీరు చెప్పిన ఆర్.నారాయణమూర్తి…విశ్వనాధ్ పోలికలు నాకు అర్థం కాలేదు. కొంత అర్థమయ్యేలా చెబితే స్పందించడానికి వీలుంటుంది.

  9. ఈ సినిమా చిన్నప్పుడెప్పుడో చూశాను. బాగా నచ్చింది. పోయినేడాది డివిడి కొని చూశాను. ఇంకా బాగా నచ్చింది. మీ అంత విమర్శనాత్మక దృష్టితో చూడలేదు. కధానాయిక సినిమా మొత్తంలో నోరు తెరిచేది మూడో నాలుగో సార్లు! చిన్నప్పుడే అది వెరైటీగా అనిపించింది నాకు. ‘సప్తపది’ చాలావరకూ అమరావతిలో తీశారని తెలిసి మా వాళ్లని పీడించి మరీ అమరావతి వెళ్లి ఆయా లొకేషన్లు చూసొచ్చాను.

    ఇక, సినిమాలోని లోపాల గురించి – తెలివిగల కధకుడు ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు పాఠకుడికే వదిలేస్తాడు. కధా రచనలోనైనా, సినీ దర్శకత్వంలోనైనా, అదో టెక్నిక్. అంతా విడమర్చి చెప్పటానికి ఇదేమీ శాస్త్రం కాదు కదా. నిజానికి మీరన్న ‘లోపాలు’ విశ్వనాధ్‌ని మరింత గొప్ప దర్శకుడిని చేశాయి. ఆయన తెలుగు వాడిగా కాకుండా ఏ బెంగాలీగానో, మళయాళీగానో పుట్టుంటే సాగతీత సినిమాలు తీసినా దిగ్దర్శకుడిగా మన్ననలందుకునేవాడే.

  10. మహేష్ గారు,

    ఎందుకు కమర్షియల్ కాదనుకుంటున్నానంటే, అందులో వ్యాపారాత్మకంగా సొమ్ము చేసుకోటానికి ఏ మసాలా కధలూ లేవు, శృంగారం అంతకన్నా లేదు. అసలు ఆ సినిమాని వ్యాపారాత్మకంగా తీసి సొమ్ము చేసుకోవాలనుకొనే నిర్మాత ఎవడుంటాడు చెప్పండి? విశ్వనాథ్ సినిమాకి నిర్మాత అవటానికి వ్యాపారాన్ని మించి కళల మీద కొద్దో గొప్పో ఆసక్తి ఉండాలి.

    ఓకే. మీ తిరుగుబాటు ప్రయోగం ఇప్పుడర్ధమైనా అక్కడ హీరోలో అంతలేసి ఆవేశాలేమీ కనపడవు, అసలాయన గారి డైలాగులే తక్కువ కదా.

    ఇకపోతే, సినిమా తీసిన విశ్వనాథ్ అదొక బ్రాహ్మణ ధృక్కోణంతో అనుకుంటూ ఖచ్చితంగా తీసి ఉండడు. ఎందుకంటే, విశ్వనాథ్ అన్ని సినిమాలు సంగీత, సంప్రదాయ ప్రధానాలు కాబట్టి మీకు అలా అనిపించొచ్చు. మీరే అన్నట్లు తనకు బాగా దగ్గరగా ఉన్న వ్యవస్థ ద్వారా చెప్పదలచుకున్నాడు. ఆ మాట కొస్తే ఎవరైనా అంతే. అంత మాత్రం చేత బ్రాహ్మణ ధృక్కోణం అంటే అర్ధాలు మారిపోతాయేమో అని నా భయం. ఇదసలే ధృక్కోణాలు, వాదాల రోజులు కదా.

    విశ్వనాథ్, నారాయణమూర్తి సంగతంటారా, ఈ సినిమానే తీసుకుంటే గుణం బాగుంటే వర్ణాంతర వివాహంలో తప్పు లేదు అని అగ్రవర్ణాల వారిలో పరివర్తన తెలియచేస్తూ చెప్పాడు. ఆయన టార్గెట్ ఆడియెన్సులో ఎక్కువ శాతం ఆ అగ్రవర్ణాలే కదా. ఇలాంటి రిలేటెడ్ విషయాలే సినిమాగా చూపించే ఆర్. నారాయణ మూర్తి లాగా విప్లవం అనో, తిరుగుబాటు అనో చూపిస్తే ఎవరికి తలకెక్కుతుంది అని నా ఆలోచన. ఎందుకంటే, ఎక్కువగా సినిమాలు చూసేవాళ్ళు బాధలు పెట్టేవాళ్ళే గానీ, బాధలు పడేవాళ్ళు కాదు, చాలా వరకు :-)

  11. avatar సాయి బ్రహ్మానందం గొర్తి says:

    సమీక్షకీ, విశ్లేషణకీ చాలా తేడా ఉంది. సమీక్షలో బాగోగులు రాసేస్తే చాలన్నట్లుగా ఉంటాయి చాలా భాగం. విశ్లేషణ వేరు. ఎందుకు బాగుందీ, ఏం బాగోలేదూ, ఏఏ విభాగాల్లో సినిమా గాడి తప్పిందీ, ఎందులో అద్భుతంగా ఉందీ, ఎందుకు ఇది మంచి చిత్రాల కోవలోకి చెందుతుందీ ఇలా ఎన్నో రాయాల్సి ఉంటుంది. కథ, కథనం, స్క్రీన్ ప్లే, నటన, సంగీతం, కూర్పు, ముగింపు, దర్శకత్వం ఇలా అన్ని అంశాల గురించీ రాసినప్పుడే పాత సినిమాల విశిష్టత మరింత తెలిసేది. నిన్ననే సినిమా రిలీజు అయినట్లుగా రాసేది సమీక్ష. ఇందులో అన్నీ పైపైన వివరాలే ఉంటాయి. సమీక్షకుల అభిప్రాయాలూ, వివరణలూ ఎక్కువ తొంగి చూస్తాయి. దాదాపు పాతికేళ్ళనాటి సినిమా గురించి రాసేది సమీక్ష అవ్వదు. విశ్లేషణ అవుతుంది. ఈ వ్యాసంలో విశ్లేషణ కి సంబంధించిన అంశాలు కనిపించ లేదు, కేవలం సంకీక్షకుల దృష్టి తప్ప. ఇదే నన్ను నిరాశ పరిచింది. విశ్వనాథ్ తీసిన సినిమాల్లో శంకరాభరణం, సాగర సంగమం స్థాయిలో ఉన్న ఈ చిత్రం ఒక ఆణిముత్యం. ఎందులో నంటారా? చాలా కాలం క్రితం స్క్రీన్ ప్లే గురించి నెను కామెంటు రాస్తూ ( గోదావరి గూఫుల లో అనుకుంటా ) ఓ పది సినిమాలు అత్యుత్తమ స్క్రీన్ ప్లే ల లిస్ట్ ఇచ్చినట్లు గుర్తు. అందులో ఈ సినిమానూ ఉంది. వీలయినప్పుడు ఈ సినిమా మీద విశ్లేషణ రాయడానికి ప్రయత్నిస్తాను. మహేశ్ గారూ, మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.

  12. @సాయి బ్రహ్మానందం గొర్తి; ఈ వ్యాసం శీర్షిక చదివిన తరువాత దీన్ని సమీక్ష అనుకునే అవకాశం అస్సలు లేదు. ఇది ముమ్మాటికీ విశ్లేషణే, అదీ ఒకే కోణంలోంచి చేసిన విశ్లేషణ. ఇందులో నేను నొచ్చుకోవడంకన్నా, మీరు అర్థం చేసుకోవలసింది చాలా ఉందని మనవి.

    నాలుగవ పేరాలో నేను ఇది సమగ్ర విశ్లేషణ కాదు, కేవలం శీర్షికలోని విషయానికి అనుగుణంగా ఉన్నవాటినిమాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పాను. అయినా మీరు నా వ్యాసంలోని అసమగ్రత గురించి నొచ్చుకోవడం అర్థరహితం. విశ్లేషణ అనేది ఒక ధృక్కొణాన్ని,ఒక అంశాన్నీ,ఒక దృశ్యాన్నీ తీసుకుని కూడా చెయ్యొచ్చని మీబోటివారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.ఇది అలాంటి ఒక ప్రయత్నం మాత్రమే.మీకు నా దృక్కోణంపై అభ్యంతరాలుంటే text (సినిమా) ఆధారంగా తప్పొప్పులను ఎత్తిచూపగలరు.

    @అబ్రకబ్ర; సినిమా భాషను బట్టి వివక్షకు గురౌతుందని నేను నమ్మను. Cinematic language is the only language of the film. ఒక తెలుగువాడిగా విశ్వనాధ్ గారు నాకు గొప్ప దర్శకుడే, కానీ గొప్ప భారతీయ దర్శకుల పేర్లనెంచేప్పుడు వీరిపేరు చాలావరకూ రాకపోవడం ఒక నిజం. దీనికి ఈయన మళయాళీ లేక బెంగాలీ కాకపోవడానికీ లంకెలేదని నా ఉద్దేశం. మంచి దర్శకుడి నుంచీ గొప్ప దర్శకుడు కావడానికి బహుశా one should excel in his craft or innovate beyond convention. చాలా మంచి సినిమాకి ఒక గొప్ప సినిమాకీ గల చిన్న గ్యాప్ ని విశ్వనాధ్ దాటలేదే అని బాధపడేవారిలో నేనూ ఒకణ్ణి.

    ఈ విషయాలపై సంపూర్ణవివరణ ఇవ్వాలంటే విశ్వనాధ గారి సినిమాలన్నింటినీ ఉటంకిస్తూ ఒక comparative study చెయ్యాలి. అదొక Phd అవుతుందేమో!

    @వికటకవి; శంకరాభరణం కన్నా ముందే విశ్వనాధ్ గారికి ఒక మంచి సినిమాతీసి దానిని కమర్షియల్లీ వయబుల్ చెయ్యగల దర్శకుడిగా పేరుంది. శంకరాభరణం తరువాత అది స్థిరపడింది.
    హీరోకి ఎన్ని డయలాగులున్నాయన్నది కాదు, అవి ఆ పాత్రగురించి ఎంత చెబుతున్నాయి అన్నది ముఖ్యవిషయం. మీరు మరోసారి ఆ సినిమా చూస్తే తన భాషలోని తిరుగుబాటు,అసహనం మీకు కనబడొచ్చు.

    విశ్వనాధ్ ఏమి అనుకొనితీసారు అనేదు కేవలం ఆయన మాత్రమే చెప్పగలరు. కానీ ఒక work of art ఎదురుగా ఉన్నప్పుడు ఒక ప్రేక్షకుడు, విమర్శకుడూ తన కోణంలోంచీ interpret చేసి అర్థాన్ని చెబుతాడు. That has nothing to do with the maker, interpreter is a creator of meaning out of given text.

    మీరు మొదట్లో అన్న sugar pill treatment వలనే ఈ సినిమా మరియూ దర్శకుడు fall short of greatness అన్నాను. దళితుల మీద సినిమాతియ్యాలంటే నారాయణమూర్తిలా “అతి” అవసరం లేదు విశ్వనాధ గారిలా “తీపి అద్దడం” అవసరం లేదు. నిజం, పాత్ర చిత్రీకరణలో చిత్తశుద్ది, కొంత పరిశోధనా ఉంటేచాలు. మీరు బి.వి. కారంత్ గారు తీసిన కన్నడ సినిమా ‘చొమ్మన దొడి’ (1976) చూసి తరువాత చర్చించగలరు.

  13. “….అతను యాజులకి ఆప్తమిత్రుడితోపాటూ, మనస్సాక్షిగా (conscious keeper ) కూడా అనిపిస్తాడు దర్శకుడు”
    —ఇది అక్షర సత్యం. ఈ పాయింట్ ని బాగా గ్రహించి తెలియచేసారు.
    హరిబాబు కోరిన విచిత్ర కోరిక కూడా అతని బ్రాహ్మణత్వాన్ని సూచిస్తుందని నా అభిప్రాయం. ఇలాంటి పవిత్రత, తన గుండెలో దేవతగా ఉండిపోవాలనడం ఎందుకో చాలా brahmanic గా నాకూ తోచింది.
    ఇక మహేశ్ చెప్పినట్టు హరిబాబు పాత్ర పరిచయం విషయంలో నేనకీభవించలేను. అతని పరిచయం, గతం కథకు పెద్దగా ఉపయోగపడదనే నా అభిప్రాయం.అది స్క్రీన్ ప్లే రచనా పరంగా లోపం కాదనే చెప్పొచ్చు.
    ఇక పోతే గౌరీనాధునికి హేమ అమ్మోరు తల్లిలా కనిపించడానికి కారణాలు వెతకడం ఒక పెద్ద కేస్ స్టడీ అవుతుందన్న రాజేంద్ర గారి మాటలు నిజం.
    నా దృష్టిలో గౌరీనాథునికి హేమ అమ్మోరు తల్లిలా కనిపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, గౌరీ హరిబాబు లు ప్రేమలో ఉన్నరన్న సంగతి ఇది వరకే చూచాయగానైనా తెలిసేవుండొచ్చు. అందుకు ఒక సాక్ష్యం డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక గౌరీ హరిబాబు కలిసి నడిచివచ్చే సీన్లో కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ గా అనిపించదు. ఎవరో మేడమీద నుంచి చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో వుంటుంది. అలా చూసింది గౌరీ నాథుడే అయ్యుండొచ్చు.
    నేనిలా అనుకోడానికి ఇంకా కారణాలున్నాయి.
    అందులో ముఖ్యమైనది గౌరీనాథుడు గుడిలో హేమ సంతాన వృక్షానికి ఊయల కట్టిన ఉదంతాన్ని తెలుసుకొనే సీను. ఈ సీన్లో అక్కడ పూజ సామాగ్రి అమ్ముకునే ఆవిడ తనకు తనుగా వచ్చి గౌరీ నాథుడికి ఈ విషయం చెప్పిందనుకోను. ఎందుకంటే ఆమె ఆ విషయం చెప్పే సమయానికి హేమ-గౌరీలు భార్య-భర్తలు. అలాంటప్పుడు ఆ విషయం ఆమె మనసులోనే దాచుకుని వుండి వుండేది.లేక మరెవరికైనా చెప్పుండేది.గౌరీనాథుడే ఈ విషయంలో అనుమానంతో ఆమెనడిగి వివరాలు తెలుసుకుని వుండొచ్చు అనేది నా వాదన. ఒక వేళ అలానే జరిగుంటే హేమ-హరిబాబుల విషయం గౌరీనాథుడుకి ముందే తెలుసు అనేది నా అభిప్రాయం.
    అందుకే గౌరీనాథుడు “పరస్త్రీ తల్లితో సమానమని మనసావాచా నమ్మాను” అని చెప్పిన డైలాగు నా వాదనకు బలం చేకూరుస్తుంది. గౌరీనాథుడుకి ముందే అనుమానం వుంది కాబట్టి ఆమె మొదటి రాత్రే పరస్తీ అని గ్రహిస్తాడు. ఊయల ఉదంతం తెలుసుకున్నాక అతని అనుమానం నిజమని గ్రహించి వారిద్దరినీ కలపడానికి బయల్దేరుతాడు.
    ఇది సినిమాను అప్పటి సామాజిక పరిస్థుతల దృష్ట్యా ఆలోచిస్తే నేను కనిపెట్టిన విషయాలు.
    అలా అని ఇదే కరెక్ట్ అని అనుకోడానికి లేదు. ఇలానే జరిగిందా/ఇలా కాకుండా వేరేలా జరిగిందా అన్న విషయం దర్శకుడు క్లియర్ కట్ గా ఏమీ చెప్పలేదు కనుక ఒక్కొక్కరూ ఒక్కోలా విశ్లేషించవచ్చు.
    ఇదే విషయాన్ని మరో కోణంలో ఆలోచిస్తే ఇంతకుముందు నేను చెప్పిన కెమెరా యాంగిల్ “God’s point of view’ కూడా అయ్యుండొచ్చు. అందుకు రీజనింగ్ వెతకాలంటే పాశ్చాత్య సినిమాల్లో human suffering లాంటి అంశాలని దేవుడు చూస్తున్నాడు అని సూచించడానికి high angle కెమెరా తో చిత్రీకరిస్తారు. ఇందులో ఆ చూస్తున్నది దేవుడు కాబట్టే, ఆ దేవున్ని ప్రతిరోజూ పూజిస్తున్న గౌరీనాథుడు తప్పు చేయకూడదని హేమ ను అమ్మవారిలా కనిపించేలా దేవుడే చేసాడని వాదించవచ్చు.
    కానీ ఎన్ని వాదనలు వచ్చినా అసలా దర్శకుడు మనసు విప్పి చెపితే గానీ నిజమేంటో మనకెప్పటికీ తెలియదు.అలాగే ఆయన చెప్పినా కూడా అదే నిజం అని నమ్మడానికీ లేదు. కారణం అతనా సీను అలా రాయడానికి sub-conscious గా అతన్ని influence చేసిన విషయాలు మనకి ఎప్పటికీ తెలుసుకోలేం కాబట్టి.
    ఉదాహరణకు ’తనీర్ తనీర్’ సినిమాలో ఒక సీన్లో ఊర్లో చదువు రాని కొంతమంది ఆ ఊర్లో ఉండే ఒకతని ఫోటో పేపర్లో ఉండడం చూసి ఆ ఫోటో ఎందుకు ప్రచురించారో తెలుసుకోడానికి ఆ ఊర్లో చదువొచ్చిన ఒకాయన దగ్గరకు వెళ్తారు. ఆ సీన్లో ఆ చదువొచ్చినాయన ఇంటి పై కప్పున కూర్చుని వుంటాడు. ఈ అడగడానికి వచ్చినవాళ్ళు కింద నిలబడి వుంటారు.దాన్ని బట్టి సమాజంలో చదువు వుండడం వల్ల మనిషి ఉన్నత స్థాయు(ఎత్తు) లో ఉంటాడని ఆ ఫిల్మ్ text ని నేను రీడ్ చేసాను. కానీ ఒక సారి కె బాల చందర్ (ఈ సినిమా దర్శకుడు) ని కలిసినప్పుడు ఈ విషయం చెప్తే ఆ సీను తీసేటప్పుడు అలా ఆలోచించలేదని చెప్పారు. సో నేను ఆలోచించింది కరెక్ట్ కాదనిపించింది. కానీఆ తర్వాత బాలచందరే ఈ సీను కోసం ఒక వ్యక్తిని ఇంటి పైకెక్కించి నేను సీను తీయడంలో నా ఉద్దేశం నాకు తెలియకపోయినా sub conscious గా నేనలా చేసి వుండొచ్చు అని అన్నారు.
    అలాగే ఒక అకిరా కురొసావా తీసిన ఒక సీను చూసి ఒకాయన “వావ్ ఇలా తీయాలని మీకెలా ఆళొచన వచ్చింది సార్” అనడిగితే, “అందులో నా క్రియేటివిటీ ఏమీ లేదు. తీసేది రాజుల కాలం నాటి సినిమా. కెమెరా కొంచెం left కి కదిపితే ఫ్యాక్టరీ భవనాలు, కొంచెం right కి కదిపితే అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఫ్రేమ్ లోకి వస్తున్నాయి. అందుకే ఇలా తీయాల్సొచ్చింది” అన్నారట.
    సో చాలా సార్లు దర్శకులు ఫలానా సీను అలా ఎందుకు తీసారో ప్రేక్షకులు తెలుసుకోవడం కష్టమైనా ఆయా సీన్ల గురించి ఇలాంటి multiple perspectives ని ప్రేక్షకులనుంచి బయటకు తెప్పించగలదే మంచి సినిమా దర్శకుడు అనేది నా అభిప్రాయం.

  14. avatar bollojubaba says:

    ఈ సినిమా నాకు నచ్చిన విశ్వనాధ్ గారి సినిమాలలో ఒకటి. భార్య అమ్మవారిలా కనిపించటమనెడిది అప్పట్లో ఒక సంచలనం.

    తన సమీక్షలో మహేష్ గారు మంచి విశ్లేషనే చేసారు. వారు చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ దృక్కోణంలో కులాంతర ప్రేమ కు నిర్వచనం చెప్పినట్లుగానే నాకనిపిస్తుంది.

    సినిమాలో హరిబాబు పాత్రకు
    1. కుటుంబ నేపధ్యం చూపించకపోవటం. ఎందుకంటే అది మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒక వేళ అలా చెయ్యవలసి వస్తే ఆ పాత్రలు, ఎదో మోహన్ బాబు , శోభన సినిమాలోలా (ఒరిజినల్: భాగ్యరాజా) పప్పెట్ షో లా ఉండవచ్చు.

    2. అతనిని ఒక రికామీ వ్యక్తి లాచూపించాలనుకోవటం, (లేదా ఐడెంటిటీని చెప్పుకోలేని విధంగా వ్యక్తిత్వాన్ని నిర్మించటం).

    3.కర్ణుడిలా పుట్టుకను దాచి విద్యలను నేర్చుకొన్నాడనే పోలిక తీసుకురావటం.

    4. తెగించి పెళ్లిచేసుకొనే సాహసం చేయించకపోవటం. అలా చూపించినట్లయితే అదికొంత తిరుగుబాటే. దర్శకుడు తన బేస్ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొనవచ్చు.

    5. వారి కలయిక కూడా ఒకరి దయాదాక్షిణ్యాలమీద జరిగినట్లుగా చెప్పటం. అదికూడా గిరీష్ పాత్రకు తన భార్య అమ్మవారు గా కనిపించటం వల్ల.

    6. ఇది అంతా సంతానవృక్షానికి ఊయలకట్టిన ఊయల వలన జరుగుతుందనే ఒక ఎస్కేపిజపు ధోరణిని ప్రదర్శించి, ప్రేమ గెలిచిందా? పెద్దల సౌహార్ధ్రం గెలిచిందా? లేక దైవ బలం గెలిచిందా అనేటి ఒక మీమాంసలో ప్రేక్షకుడిని పాడెయ్యటం.

    మహేష్ గారు సినిమాను విశ్లేషించిన కోణం వినూత్నమైనది. ఇలా విశ్లేషించవలసి వచ్చినప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో వారు చాలా జాగ్రత్త పడ్డారు. కనుకనే ఈ టపాకింత సాధికారికత వచ్చింది.
    మాంచి టపానీ దానిపై రేగిన కామెంట్లనీ చదివించారు. కృతజ్ఞతలు.

    ఈ సినిమాలోని సాహిత్యం అద్భుతం గా ఉంటుంది.
    ఇక విశ్వనాధ్ గారు గ్రేటా, గుడ్డా అంటే, నేను గ్రేటనే అంటాను ఎందుకంటే ఆయన మనవాడు కనుక (బహుసా ఇది పిడివాదనని అనిపించినా సరే).

    బొల్లోజు బాబా

  15. ఈ సినిమాలో ఎన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయో ఈ విశ్లేషణలో అన్ని తార్కిక లోపాలున్నాయి.
    మొదటిది .. వ్యాసరచయిత సార్వత్రిక ప్రవచనాలు చేసే ముందు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో అభ్యుదయ ఉద్యమాల చరిత్ర కొంచెం అధ్యయనం చేస్తే మంచిది.
    రెండు .. ఒక్క యాజులు పాత్ర (అతనికి మనస్సాక్షిగా రాజు పాత్ర) తప్ప మిగతా అన్ని పాత్రలూ వారి వారి వ్యక్తిగత ఆశలకీ బలహీనతలకీ అనుగుణంగా ప్రవర్తించే వారే తప్ప అంతకు మించిన ఏ సామాజిక పరమార్ధమూ వారి దృష్టిలో లేదు. ఇక్కడ హరిబాబు హరిజనుడు కావడం ఇంచుమించు యాదృఛ్ఛికం. అతడు బ్రాహ్మణుడు కాక ఏ ఇతర కులస్తుడైనా ఈ కథ ఉన్నదున్నట్లు నడవడానికి ఏ ఇబ్బందీ లేదు. ఐతే అతను హరిజనుడైతే వచ్చే కాంట్రాస్టు షాక్ వేల్యూని మేక్సిమైజ్ చేస్తుంది గనక అతన్ని హరిజనుణ్ణి చేశారనిపిస్తుంది. హరిబాబు పాత్రకి సంబంధించి దళిత అనే పదం వాడటం కూడా అనవసరమే. దళిత అనే లేబుల్ వాడుకే ఎంతో కొంత ఆ జాతి చైతన్యాన్ని సంతరించుకుని ఉన్నది. అలాంటి చైతన్యం ఏదీ ఈ చిత్రంలో లేదు.
    అసలు విశ్వనాథ్ ఈ సినిమాని ఒక అభ్యుదయ సందేశం ఇవ్వడానికి తీశారని నాకనిపించదు.
    ఇవి మచ్చుకి.
    కథనానికి సంబంధించి వ్యాసరచయిత చేసిన అబ్సర్వేషన్లు కొన్ని బావున్నాయి, సినిమాని అర్ధవంతంగా చూడ్డానికి ఉపయోగిస్తాయి. ఉదా. రాజు యాజులుకి ఆత్మసాక్షి, హరి హేమల ప్రేమోదంతం గౌరీనాథుడికి తెలియడం ఇత్యాదులు.
    మేరువంత ఉన్నతంగా కనిపించే పాత్ర యాజులు. హేమ, హేమ తండ్రి, హరి, చాలా వరకూ గౌరీనాథుడు కూడా .. అసలే జీవం లేని పాత్రలు. ఆ పైన, యాజులు పాత్ర పకన మరీ వెలాతెలా పోతున్నాయి. ఆ మేరువుకి దీటుగా నిలిచే ఇంకో పాత్ర లేక మరీ ఏకపక్షం ఐపోయింది. (సినిమా బ్రాహ్మణ దృక్కోణం నించి అనడానికి ఇదీ ఒక ఋజువే!:))
    ఈ సినిమాలో నాకు నచ్చినవి – సినిమా కోసం రాసిన పాటలు. కొన్ని కొన్ని సూక్ష్మమైన అంశాలని అన్యాపదేశంగా చెప్పిన తీరు .. ఉదా. ఏ కులమూ నీదంటే పాట, ఆలయంలో చిత్రీకరించిన కొన్ని దృశ్యాలు. ఒక బ్రాహ్మణాగ్రహారంలోని నేటివిటీ (రమణ మూర్తి ఇంట్లో జరిగే సన్నివేశాలు) .. చాలా బాగా తీశారు. ముఖ్య పాత్రలు అగ్రహారంలో వీధి వెంబడి నడుస్తుంటే, అరుగు మీద కూర్చుని బ్రహంచారులు నమకం వల్లె వేస్తుంటారు. ఆలయంలోనూ ఇలాంటి దృశ్యాలు ముఖ్య సన్నివేశాలకి మంచి back drop గా ఉంటై. ఆభేరి రాగాన్ని ప్రేమ సందేశంగా వాడటం – Now that is one heck of a concept. Just for that, I am willing to forgive all other transgressions of this movie :)
    అస్సలు నచ్చనివి (ఇలాంటివి చూసినప్పుడే ఎవరన్నా విశ్వనాథ్ కళాతపస్వి అంటే నాకు చిర్రెత్తుకొస్తుంది) – నాట్యం ముఖ్యాంసంగా తీసిన ఈ సినిమాలో ప్రదర్శించిన నాట్యం నేలబారుగా ఉంది. జానకి గొంతులో భామ ప్రవేశ దరువు ఘోరంగా ఉంది. ఆమె నాట్యం కూడా అంతే ఘోరంగా ఉంది. కాకపోతే అకస్మాత్తుగా భామ ఒక బ్రాహ్మణ ఇంటి ఇల్లాలై వడియాలు పెట్టడం లాంటీవి బాగా ఉపయోగించారు. దుర్గా సూక్తాన్ని బాలు మరియు ఇంకో స్త్రీ గొంతు (జానకి? శైలజ?) “పాడిన” తీరు పరమ దరిద్రంగా ఉంది, కాకపోతే దీనికి ఆ అమ్మాయి extempore గా చేసే అభినయం పరవాలేదు.
    వ్యాసరచయిత భాష వాడుక విషయంలో ఇంకొంచెం శ్రద్ధ వహించాలి. సీరియస్ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు భాష వాడుక సవ్యంగా లేకపోతే అనవసరమైన సందిగ్ధాలు వస్తాయి. ఉదా. యాజులు పాత్ర అనాల్సిన చోట యాజులు పాత్ర ధారి అన్నారు. ఇలాగే మరి కొన్ని.
    విశ్వనాథ్ సినిమాలు వ్యాసరచయితకి విపరీతంగా నచ్చి ఉంటే ఉండొచ్చు గానీ ఒక విశ్లేషణలో అంత ఉదాత్త పదజాలంతో ఆ వ్యక్తిని పొగడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇతర పరిణామాలు ఏమైనా ముందసలు పాఠకులకి ఇదొక పొగడ్తల నీరాజనంలా కనిపిస్తుంది గానీ బుద్ధితో కూడిన విశ్లేషణ అనిపించదు.
    ఇదంతే చెప్పింది మహేష్ గారు ఇంకా మంచి వ్యాసాలు ఇంకా సమర్ధవంతంగా రాయాలనే.

  16. చెప్పడం మరిచాను. హరి – హేమ – గౌరీనాథుడు ముక్కోణం గురించి పైన వెంకట్ చెప్పిన విషయాలు బాగున్నాయి. ఒక్కోసారి అనుకోకుండా దర్శకులు ఉపయోగించిన పద్ధతులు ఆయా దృశ్యాలకి మరింత విలువ చేకూరుస్తాయి.
    ఈ సినిమా కమర్షియల్ సినిమానా కాదా, ఈ వ్యాసం సమీక్షా? విశ్లేషణా? లాంటి గుడ్డుకి ఈకలు పీకే చర్చల వల్ల ఏదన్నా కొత్త ఆలోచన ఉందేమో చూద్దాం అని వెదికే నాబోటి పాథకులకి ఏవీ ఉపయోగం ఉండదు.

  17. @వెంకట్, మీ విశ్లేషణ ముఖ్యంగా God’s pint of view చాలా బాగా అనిపించింది.

    @బొల్లోజు బాబాగారు, ధన్యవాదాలు. మీ point wise explanation చాలా విషయాల్ని తేటతెల్లం చేసింది.

    @కొత్తపాళీ: ధన్యవాదాలు. మీ సలహాలూ,సూచనలూ శిరోధార్యం.
    ఆంధ్ర ప్రదేశ్ లో అభ్యుదయ ఉద్యమాల చరిత్ర కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వ్యాసం రాసిన తరువాత ఎటువంటి ఎడిటోరియల్ కళ్ళబడకుండా ఇక్కడ వెనువెంఠనే పోస్ట్ చెస్తాను కాబట్టి, భాషా దోషాలు ముఖ్యంగా మీరు ఎత్తిచూపినవి జరిగాయి. ఇకనుంచీ భాష వాడుక మీద మరింత శ్రద్ధ వహిస్తాను. ఇకనుంచీ “నీరాజనాలు పట్టడం” కూడా తగ్గించేస్తా!

  18. avatar sujaata says:

    ఈ సినిమా విడుదలైనపుడు ఊహతెలీని వయసు కావడంతో అర్థం కాలేదు. తరవాత టీవీలో చూశాను.

    మహేష్ గారు,
    ‘భగవంతుడు గుణగణాల్ని బట్టి కులాల్ని నిర్ణయించాడు కాని పుట్టుకని బట్టి కాదు ‘ అనే ఆర్యోక్తికి సరితూగేలా చెయ్యాలంటే నాయకుడు తన గుణ గణాల్లో బ్రాహ్మణత్వాన్ని చూపించాలి గానీ మోసంతో వేదం నేర్చుకోని ‘కర్మ బ్రాహ్మణుడిగా ‘ రూపొందడం ఎలా సాధ్యమో అర్థం కాలేదు.

    “నీ మనసులో మరో పురుషుడు ఉన్నాడు కాబట్టి నువ్వు నాకు అమ్మవారిలా కనపడ్డావు ‘అని గౌరీ నాధుడి చేత అనిపించడం, నాయికని నాయకుడికి ‘కన్య ‘ గా అప్పగించడానికి తప్ప అందులో గొప్ప తర్కం ఏమీ లేదు.

    ఈ సినిమాని విశ్వనాథ్ అంత చిత్త శుద్ధితో తీసినట్టు నాకు అనిపించలేదు.కులాంతర వివాహం(పైగా వితంతు వివాహం కూడా) అనే సబ్జెక్టుతో బాపు తీసిన ‘వంశవృక్షం ‘ సినిమా కూడా ఇలాగే అనిపించింది. కరడు గట్టిన సనాతన బ్రాహ్మణుడిగా సోమయాజులు, ఇమిడిపోతాడు గాబట్టి , ఆయన బ్రాహ్మణుడిగా పాత్రలో జీవించాడు. చివర్లో నది మెట్ల దగ్గర సబితను హీరోకి అప్పగించేటపుడు సోమయాజులు నటన నిర్జీవంగా(నాకలా అనిపించిందేమో)ఉంటుంది. డైలాగులు అప్పజెప్పినట్టు ఉంటాయి.

    అన్నింటికంటే ఈ సినిమాకు పెద్ద draw back సబిత! భావ శూన్యమైన మొహంతో గుడ్లగూబలా చూస్తూ ఉంటుంది తప్ప ‘నటన ‘ అన్నది ఏ కోశానా కనపడదు.మరెవరినైనా పెట్టుకుని ఉంటే సినిమా బాగా హిట్ అయి ఉండేదేమో!

    పాటల సాహిత్యం మాత్రం అనన్య సామాన్యం!

    మహేష్,
    వంశవృక్షం మీద కూడా ఒక టపా కొట్టండి మరి!

  19. @సుజాత; నాయకుడి గుణగణాలు చూపాలంటే కొన్ని సీన్లు పెట్టాలి, అదీ అతను హరిజనుడని తెలిసిన తరువాత. అలా పెట్టాలంటే ఆ పాత్ర గురించి కథకుడికి తెలియాలి. దర్శకుడూ, కథకుడూ బ్రాహ్మణులే గనక వారికి ఆపాత్ర అంతుబట్టక, అర్జంటుగా అతన్ని సంస్కరించాలిగాబట్టి అతనిచేతనే, “నేను వేదం, సంగీతం నేర్చుకున్నాను” అనిపించారని నా ఉద్దేశం. హరిజనుడు ఎలాగూ ఇవి సూటిగా నేర్చుకోలేడు గనక, అతన్ని ఒక “ఏంచేసైనా అనుకున్నది సాధించే” వ్యక్తిగా మలిచి కథనడిపారు.

    కానీ, ఇంతటి తిరుగుబాటుతత్వం కలిగిన నాయకుడు స్వతంత్రించి నాయికను తీసుకెళ్ళిపోకుండా, అతనిచేత ఒక “విచిత్రమైన” కోర్కెని కోరుకోనిచ్చి ఆ పాత్ర ఔన్నత్యానికి మంగళహారతినిచ్చినట్టుగా నాకు అనిపించే, ఈ వ్యాసం శీర్షికని అలా పెట్టాను.

    మీరు చెప్పిన ‘కన్యగా అప్పగించడం’ భలే పాయింట్. నాకు అసలు తట్టనేలేదు.

    సప్తపది కన్నా, బాపు గారి ‘వంశవృక్షం’ లో complexities ఎక్కువ. దాన్లో ఒక స్థాయిలో సాంప్రదాయాలూ సమాజం ఉంటే, మరోస్థాయిలో మానస్తత్వ శాస్త్రానికి సంబంధించిన కోణాలూ (హీరొయిన్ యొక్క suffering ), అలౌకిక- platonic ప్రేమలూ (కాంతారావు – శ్రీలంక అమ్మాయిల సంబంధం) ఉంటాయి.
    ఆ సినిమా గురించి రాస్తే నిజంగానే బాగుంటుంది. వీలుంటే ప్రయత్నిస్తాను.

  20. చర్చ చాలా రసవత్తరంగా సాగుతుంది.మధ్యలో దూరటమెందుకని ఆగుతున్నా,చివరలొ వీలుంటే నా అభిప్రాయం రాసేందుకు ప్రయత్నిస్తా.

  21. avatar కామేశ్వర రావు says:

    సప్తపది సినిమాలో కనిపించేది ఒక బ్రాహ్మణుని దృక్కోణమే అన్నదాంట్లో సందేహించాల్సిందేమీ లేదు. అయితే, దానివల్ల సినిమాకి లోపం కలిగిందన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. కథలో అది ఎలాటి అసంబద్ధతకీ, అసమగ్రతకీ దారితియ్యలేదనే నేననుకుంటున్నాను. ఒకే దృక్కోణంలోంచి చూపించడంవల్ల అది అసంపూర్ణమే! సంపూర్ణ సత్యం అన్నది ఊహే, సత్యాన్ని ఎప్పుడూ ముక్కలు ముక్కలుగానే చూడగలం అనే ఆధునికానంతర(post-modernist) దృక్పథంలో ఆలోచిస్తే అది లోపం అనిపించదు.
    కథానాయకుడు (hero) అన్న చట్రంలోంచి బయటకి వస్తే, హరిబాబు పాత్రలో వెలితికానీ, వైరుధ్యంకానీ కనిపించదు. ఆంతరంగికంగా తిరుగుబాటుతత్వమున్నా, సమాజాన్ని బలంతో ఎదిరించే మనస్తత్వం కాదతనిది. దొంగతనంగా సంగీతం నేర్చుకోడంలోనూ, ప్రేమించిన అమ్మాయిని కోరిన కోర్కెలోనూ ఇదే కనిపిస్తుంది. ఆ పాత్రని ఎందుకలా చిత్రించాడు అంటే, బ్రాహ్మణ దృక్పథంవల్లనే అని సమాధానం చెప్పుకోవచ్చు.
    అలాగే గౌరీనాథుడికి శొభనం రాత్రి తన భార్య దుర్గాదేవిలా కనిపించడం కూడా బ్రాహ్మణులలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న “పవిత్రత” మీద ఆధారపడిందే. దానిగురించి తెలిసినవారికి అది వింతగా కూడా అనిపించదు. బహుశా దీనికి రామకృష్ణ పరమహంస కూడా ప్రేరణ అయి ఉండవచ్చు.
    ఇలా బ్రాహ్మణ దృక్కోణంలోంచి వచ్చిన సినిమా అని గుర్తించి ఊరుకుంటే దానివల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. దీనివల్ల దర్శకుడు ఆశించినది ఏమిటన్న విషయం ఆలోచిస్తే, ఆ ఆశయానికి ఈ దృక్కోణం ఎలా సరిపోయిందీ బోధపడుతుంది. విశ్వనాథ సినిమాలన్నిటినీ పరిశీలిస్తే, అతని దృక్పథం సులువుగానే తెలిసుకోవచ్చు:
    1. మార్పు కోరుకున్నా, విశ్వనాథ సనాతన సంప్రదాయాలకి పూర్తి వ్యతిరేకి కాదు. పాతలో కొంత మంచి ఉందని, ఆ మంచిని కాపాడుకొంటూ, చెడుని మాత్రం విసర్జిస్తూ సమాజం మారాలన్నది అతని ఆశయం.
    2. రక్తపాతం వల్ల కాకుండా, అహింసా మార్గంలో చెడుకి మూలమైన ప్రజల మనస్తత్వాలలో మార్పు తేవడమే సమస్యకి సరైన పరిష్కారమని అతని నమ్మకం. (ఇది సూత్రధారుల్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం)
    పై విషయాలని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే కథా, పాత్రలూ దానికి అనుగుణంగానే ఉన్నాయని అనిపిస్తుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా విశ్వనాథ మార్పుకోరింది బ్రాహ్మణుల అలోచనల్లో. అందుకే అది బ్రాహ్మణ దృక్కోణంలోంచే నడిచింది.
    విశ్వనాథ సినిమాల్లో నాకన్నిటికన్నా నచ్చినవి స్వాతికిరణం, సప్తపది. కథాపరంగా అస్సలు నచ్చనిది సాగరసంగమం!

  22. ఈ సినిమా కధ మర్చి పోయి, నేను వేరేసినిమా కధతో కలగాపులగం చేస్తుంటే తప్పితే …
    హేమది బ్రాహ్మణ ( కుల పరంగా) కుటుంబం కాదు .. హేమ తండ్రికి యాజులు గారింట్లో కి ప్రవేశం లేదు .. యాజులు గారి కోడలు జంకుతూ హేమ దగ్గరకి వెళుతుంది..
    ఈ నేపధ్యం లో .. ఈ సినిమాని ( ఆ రోజుల్లో) మారుతున్న బ్రాహ్మణ ఆలోచనా ధోరణికి ప్రతీకగా ఎందుకు పరిగణించరాదు..?

    కొత్తపాళి గారు,
    ఈ చిత్ర సంగీత, సాహిత్యాలపై మీ సమీక్ష కోసం ఎదురుచూస్తుంటాను.

  23. @ఊకదంపుడు గారూ; మీరు సినిమా చూసి చాలా రోజులైనట్టుంది. హేమ తండ్రి బ్రాహ్మణుడే,కానీ నాట్యాచార్యుడు. అందుకే యాజులకి చిన్నచూపు. కొన్ని పద్దతుల ప్రకారం బ్రాహ్మణుల్లో కూడా అందరు బ్రాహ్మణులూ సమానం కాదు. బ్రాహ్మణుల్లోకూడా శాఖాపరమైన,వృత్తిపరమైన చిన్నచూపులున్నాయన్న సంగతి మీకు తెలియదనుకుంటాను. యాజులు అర్చకత్వం చేస్తున్నాడు కాబట్టి నాట్యాచార్యుడైన బ్రాహ్మణుడిమీద చిన్నచూపు.

  24. నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది
    తాను చెప్పాలనుకున్న విషయాన్ని, అనవసర విప్లవ గీతాలు లేకుండ సున్నితం గా చెప్పారు విశ్వనాథ్
    ముఖ్యం గా గౌరీ నాథ శాస్త్రి పాత్ర………విశ్వనాథ్ పాత్రలలో నాకు ఎంతో ఇష్టమైన పాత్ర
    అలాంటి పాత్ర సృష్టించడం వెనుక దర్శకుడి సంస్కారం కనిపిస్తుంది
    హేమ పాత్రధారి నాట్యం కూడా నాకు నచ్చింది, ముఖ్యం గా “నెమలికి నేర్పిన నడకలివే…” పాటలో అచ్చు నెమలిలాగా సుశీలమ్మ పలికిన తీరు చాలా ఇష్టం నాకు
    వేటూరి సాహిత్యం కూడా చాలా బాగుంటుం

  25. ముఖ్యం గా “నెమలికి నేర్పిన నడకలివే…” పాటలో అచ్చు నెమలిలాగా సుశీలమ్మ పలికిన తీరు చాలా ఇష్టం నాకు
    వేటూరి సాహిత్యం కూడా చాలా బాగుంటుం ??
    లలిత గారు,మీ వ్యాఖ్య అసంపూర్తిగా ముగిసిందా? మీరన్న నెమలికి నేర్పిన నడకలు పాడింది యస్.జానకి సుశీలమ్మ కాదండి
    http://youtube.com/watch?v=cur3UQU1opI&feature=related
    ఇక్కడ చూసి,విని ఆనందించండి :)

  26. avatar Aruna says:

    బాగుంది.ఇలాంటి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యిన ఒక పల్లెటూరి పిల్ల, పెళ్ళి అయ్యిన తర్వాత కూడా ప్రియుడితో సంభాషణలు కొనసాగించేదట. ఈ వాలకం నచ్చక, ఆ పిల్ల భర్త సంగతి ఏంటి అని అడిగితే, ఇద్దరం ప్రేమికులం అని చెప్పిందిట. కాకపోతే, సినిమాల ప్రభావమో, డిటెక్టివ్ నవలల ప్రభావమో ఆ పిల్లవాడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ రహస్యంగా రెకార్డ్ చేసాడు. అది కాస్త పట్టుకెళ్ళి పంచాయితీ లో పెట్టాడు. ప్రేమ జంట ని పిలిపించీడిగితే, ఆ పిల్ల నిజమే అని వొప్పుకుని, మొగుడు పంపిస్తే ఈ తన ప్రేమికుడితో వెల్లిపోతాను అని చెప్పిందిటా. సదరు ప్రేమికుడు మాత్రం, నేను ఇంక వదిలేద్దాం అన్నా వినకుండా నన్ను తీస్కెల్లిపో అని అడుగుతోంది. నాకొద్దు, నన్ను వదిలెయ్యండి అని పారిపోయాడు.ఇంత జరిగక నెను ఇంట్లొ వుండనియ్యను అని మొగుడు తరిమేశాడు. ఆ పిల్ల జీవితం ఎటూ కాకుండ అయ్యి పుట్టింటికి చేరింది. సినిమాల్లో కాని నిజ జీవితం లో ఇలాంటివి జరగవు. అన్ రియలిస్టిక్ సినిమాల వల్ల చేతనం తీస్కురావాలంకోవడం ఒక వ్రుధా ప్రయత్నం. ఒక సినీ అభిమానుల పత్రికలో, హిట్ సినిమా మిద నా వ్యాఖ్య అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అయినా as it is a open discussion, I am expressing my view.

  27. @అరుణ: ఈ వ్యాసంకూడా అందరి ఆమోదం కోసం కాదు. కేవలం విభిన్నదృక్కోణాల్ని పంచుకోవడానికి మాత్రమే.కాబట్టి మీ వ్యాఖ్య/అభిప్రాయం తోపాటూ మీకు తెలిసిన నిజానికి అంతే ప్రాముఖ్యత ఉంది.

  28. avatar సుత్తి కత్తి says:

    @ మహెష్, మీ వ్యాసము రాయటం లో సరళత లేదు.ముగింపు ఎప్పుడు నాకు తెలిసి సందిగ్దం తో ఎవ్వరు ముగించరు. మీవ్యాసం లో పద విన్యాసాలు ఎక్కువా సబ్జెచ్త్ తక్కువ గా అని పిస్తుంది.

    ” సప్తపది ఒక మంచి సినిమా, విశ్వనాధ్ గారు చాలా మంచి దర్శకులు. కానీ, భారతదేశ సినిమా జగత్తులో “గొప్ప” దర్శకుల జాబితాలో ఈయన చేరకపోవడానికిగల కారణాలు ఈ చిన్నచిన్నలోపాలే అనిపిస్తుంది. హె ఇస్ అ వెర్య్ గూద్ దిరెచ్తొర్ వ్హొ ఫల్ల్స్ షొర్త్ ఒఫ్ గ్రేత్నెస్స్. మన తెలుగు సీనీమతల్లికి మహత్తరమైన, మంత్రపుష్పాల్లాంటి సినిమాల్ని అందించిన ఈ దర్శకదిగ్గజం మనకుమాత్రం ఎప్పటికీ గొప్పదర్శకుడే!”

    పైన మీ ముగింపు వ్యాఖ్యాలు ఒక సారి చదివితె లె అఫ్ చెసె ముందర కంపెని సి ఇ ఓ మాటలు లా వున్నాఇ. It is acceptable to me, if CEO speaks like this because he is doing a business and he is laying off “X” number of staff. But a TV journalyst should not hesitate telling how many number of people that company CEO laying off.
    You are writing an article means you should be very clear about that topic.
    What does you mean mantrapushpam ?
    నాకు భారతదేశ సినిమా జగత్తులో గొప్ప దర్శకుల జాబితా ఎవరు ఎప్పుడు తయరు చెసారో మీరు కొంచెం చెప్పి పుణ్యం కట్టు కొండి. You tell me where K . viswanath should go to include his name in the Indian top directors list.
    సినిమా ల కి పేరు ఒక స్థాయి వచ్హింది కమర్షీల్ హిట్స్ తో అవార్డ్ సినిమా ల తో కాదు. మీరు సినిమా ల మీద వ్యాసాలు రాయ తానికి కుడా అదే కారణం. ఎందుకంటె మీరు నాటకల మీద వ్యాసాలు రాయటం లేదు గనుక. మీరు ఒప్పుకొక పొతె అది మీ ఇష్టం.
    I love watching Maya bazar film 100 times rather than watcing movies made by great directors. K viswanath is the most sucessfull director compared to those “GREAT” directors your talking about. Becuase he showed Indian art and culture where as ” GREAT” directors showed poverty, back wardness to the world.

  29. sir, meeru entho kastapadi mari sapthapadi lo onna brahmana konanni chusaru kani, ee cinema product nati kalamana paristitulani prati okkaru observe cheyali. ethi tappa anni chestunnaru. aayana brahmantvam anndi papama leka tappa anthu ke somayajulu patra paranga aa prarambha vakyalu .ela chala vishyalu lekaa lo tisukoni juri award istaru. aayan enati kalamanamto chooste classic ’s ga oona mayabazar, missmma, gundamma katha ela enno vati meeda vimarsalu cheyavachhu. asalu dalithavadam ani maha level lo kottukunttna vari ke dalithula meeda premavundadu. rajyadhikaramu leka inkoti ani ookadampudu swrdhapuritha matalu taapa vari vargani paniki vacche prathipadana okkati kooda cheyaru. mari eenadu reservation system valla enthamandi prathibha vundi ibbandi paduthunnaru. kotla rupaiah lu vunna vadi ke reservation. veetmeda spandana vundadu kani enado vachhina sapthapadi meeda brahmana drukkonam lo samiksha . ok this is only dalithavatham.

  30. రమేష్ బాబు,మీరు http://lekhini.org/ వాడి ఈ వాక్యాలు తెలుగులో రాయవచ్చు.

  31. @ఆలపాటి రమేష్ బాబుగారు: మీరు చెబుతున్న కాలమానంలో “హరైజనోద్ధరణ-సామాజిక న్యాయం” అనే పేర్లమీద దళితఉద్యమాలు ముఖ్యంగా వామపక్షభావజాలం ఆధారంగా జరిగేవి. ఈ ధృక్కోణంతో చూస్తేకూడా ఈ సినిమా elite perspective లోనే ఉంటుంది. ఆ ధృక్కోణం తప్పని నేను అనటం లేదు. అలావుండటం దర్శకుడి limitation అనిమాత్రమే suggest చేశాను. ఇక మీరు చెప్పిన దళిత ఉద్యమాలతో నాకున్న తేడాలునాకున్నా, అదిక్కడ చర్చనియాంశం కాదు.

    @సుత్తి-కత్తి (?): నా వ్యాసాలు సరళతరం చెయ్యడానికి నేను ప్రయత్నిస్తాను. సూచనకు ధన్యవాదాలు. ఇక నా వ్యాసంలో సబ్జెక్ట్ లేదనేది మీ వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి,దాంతో ఎటువంటి విభేధం లేదు. ఇక ముగింపు సందిగ్ధం అన్నారు. నాకైతే తేటతెల్లంగానే ఉంది. కాబట్టి అక్కడా చర్చకు ఆస్కారం లేదు. ఇక ‘గొప్ప’ ‘మంచి’ దర్శకులమీద మీధృక్కోణం సృష్టంగా చెప్పారుకాబట్టి. మన ఆలోచనాధోరణులు కలిసేవికావు.

  32. avatar jaya says:

    nakaite ee cinema lo asalu hero gouri nadhudu anipistadu. Parayi purushudu manasulo unna AMBA nu takadaniki kuda istapadani MAHABHARATAM heros ni drustilo pettukoni indian hindu character ni create chesaru kaabatte manaki aa cinema amtala gurtu umdi poyimdi.

Leave a Reply